స్వీడన్కు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్తో సంబంధం ఉన్న 22 ఏళ్ల దిశా రవి అనే యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేసి టూల్కిట్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. దిశ బెంగళూరుకు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి. దిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల నిరసనలకు దిశా రవి, గ్రెటా థన్బర్గ్ మద్దతు పలికారు. ఇదే వ్యవహారంలో దిశ ఒక ఆన్ లైన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు. దీన్నే టూల్కిట్ అంటున్నారు. రైతులకు మద్దతుగా గ్రెటా సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ తరువాత టూల్కిట్ గురించి బయటకు తెలిసింది. ఈ ఆన్లైన్ డాక్యుమెంట్ ద్వారా దేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి విదేశీ శక్తులతో కలిసి దిశ కుట్రలు పన్నుతున్నట్లు అభియోగాలు నమోదు చేశారు. గత ఆదివారం బెంగళూరులో ఆమెను అదుపులోకి తీసుకొని దిల్లీ తరలించారు.
దిశారవిపై ఆరోపణలు
రైతులకు మద్దతుగా దిశ ఒక ఆన్లైన్ డాక్యుమెంట్ను తయారుచేసి, దాన్ని ప్రణాళిక ప్రకారం షేర్ చేసిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. దిల్లీలో గణతంత్ర దినోత్సవం నాడు అల్లర్లు చెలరేగాయి. ఆ సమయంలో రాజధానిలో హింసను పెంపొందించడానికి దిశ ఒక యాక్షన్ ప్లాన్ను రూపొందించిందని వారు చెప్పారు. దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతుల బృందం జనవరి 26న నగరంలోకి ర్యాలీగా వచ్చారు. పోలీసులతో ఘర్షణకు దిగడంతో పాటు ఎర్రకోటపై దాడి చేశారు. ఇలాంటి చర్యలకు సంబంధించిన ప్రణాళికలను ఆన్ లైన్ డాక్యుమెంట్లో రూపొందించారనేది ప్రధాన ఆరోపణ. దీన్ని దిశతో పాటు గ్రెటా థన్బర్గ్ కూడా షేర్ చేసింది. ఈ ఆన్లైన్ యాక్షన్ ప్లాన్ను "టూల్ కిట్" అని పిలుస్తున్నారు. ముందు ఈ డాక్యుమెంట్కు సంబంధించిన లింక్ను గ్రెటా థన్బర్గ్ ట్వీట్ చేసింది. కానీ ఆ తరువాత దాన్ని డిలీట్ చేసింది. అప్పటి నుంచి దిశా రవి అరెస్టుపై ఆమె ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.
టూల్ కిట్ అంటే ఏంటి?
టూల్కిట్ అంటే యాక్షన్ ప్లాన్స్ను వివరించే ఒక సోషల్ మీడియా డాక్యుమెంట్. రైతుల ఆందోళనకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసేందుకు దిశ రూపొందించిన ఈ ఆన్లైన్ యాక్షన్ ప్లాన్ను టూల్ కిట్ గా పిలుస్తున్నారు. ఈ ఆన్లైన్ డాక్యుమెంట్లో జనవరిలో నిర్వహించాల్సిన సోషల్ మీడియా క్యాంపెయిన్, ఆన్ గ్రౌండ్ యాక్షన్ ప్లాన్కు సంబంధించిన వివరాలు ఉన్నాయని దిల్లీ పోలీసులు తెలిపారు. నిరసనకారులు రాజధాని నగరంలోకి ప్రవేశించడం కూడా టూల్కిట్ ప్రణాళికలో భాగమని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసేందుకు ప్రత్యేకంగా టూల్కిట్ను సృష్టించారని వివరించారు. సోషల్ మీడియాలో ప్రణాళిక ప్రకారం తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసి రైతుల ఆందోళనలను తప్పుదోవ పట్టించేందుకు ఏర్పాట్లు చేశారు. నకిలీ వార్తలను వ్యాపింపజేసేందుకు ఒక ట్వీట్ బ్యాంకును కూడా ఏర్పాటు చేశారని పోలీసులు వెల్లడించారు.
దేశద్రోహం కేసు
ఈ ఆన్లైన్ డాక్యుమెంట్ తయారు చేసిన వారిపై ఫిబ్రవరి 4న దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దేశద్రోహం, హింసను ప్రేరేపించే ఉద్దేశంతో రెచ్చగొట్టడం, నకిలీ వార్తలను వ్యాపింపచేయడం వంటి ఆరోపణలతో పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ టూల్కిట్ డాక్యుమెంట్ ఆర్కైవ్స్ వెర్షన్ను రాయిటర్స్ వార్తా సంస్థ రివ్యూ చేసింది. నిరసనలను ఎలా నిర్వహించాలి. నిరసనల్లో ఎలా పాల్గొనాలి అనే అంశాలకు సంబంధించిన మార్గదర్శకాలు దాంట్లో ఉన్నాయి. ప్రధానంగా రైతుల ఆందోళనలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ టూల్కిట్ను రూపొందించారు.
ఇంకా ఎవరి ప్రమేయం ఉంది?
ముంబైకి చెందిన లాయర్ నికితా జాకబ్, శంతను అనే మరో వ్యక్తికి కూడా టూల్కిట్ వ్యవహారంతో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో ఉన్నామని చెప్పారు. సిక్కు ఉగ్రవాద సంస్థ ఖలిస్థాన్తో కలిసి వీరు పనిచేస్తున్నారని పోలీసులు వివరించారు. ఆ సంస్థ నిర్వహించిన ఒక ఆన్లైన్ మీటింగ్లోనూ వీరు ముగ్గురూ పాల్గొన్నట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Disha, Farmers, Farmers Protest, New Agriculture Acts