VINAI KUMAR SAXENA FORMER CHIEF OF KHADI COMMISSION APPOINTED DELHI NEW LIEUTENANT GOVERNOR MKS
Vinai Kumar Saxena : ఢిల్లీ కొత్త గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా.. ఎన్నికల వేళ ఏం జరుగునో?
ఢిల్లీ కొత్త గవర్నర్ వినయ్ సక్సేనా
త్వరలోనే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనుండగా అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్ నియమితులయ్యారు. ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనాను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం సోమవారం ప్రకటన చేసింది..
బీజేపీయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గవర్నర్ వ్యవస్థల పనితీరుపై ఇటీవల విమర్శలు వెల్లువెత్తుతుండటం, గవర్నర్ల ద్వారా కేంద్రం సంకుచిత రాజకీయాలు చేస్తోందంటూ విపక్షాలన్నీ ఉమ్మడిగా గళమెత్తడం తెలిసిందే. శాంతి భద్రతలు కేంద్రం చేతుల్లో ఉన్న ఢిల్లీలోనైతే సీఎం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ నిత్యకృత్యంలా మారింది. త్వరలోనే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనుండగా అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్ నియమితులయ్యారు. (Vinai Kumar Saxena New Lieutenant Governor of Delhi)
ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా నియమితులయ్యారు. రాష్ట్రపతి కార్యాలయం ఈ మేరకు సోమవారం ప్రకటించింది. వినయ్ కుమార్ సక్సేనాను నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించినట్లు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం ఆయన ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్గా ఉన్నారు.
1958 మార్చి 23న జన్మించిన వినయ్ కుమార్ సక్సేనా, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. రాజస్థాన్లోని జేకే గ్రూప్లో అసిస్టెంట్ ఆఫీసర్గా కెరీర్ను ప్రారంభించారు. వైట్ సిమెంట్ ప్లాంట్లో వివిధ హోదాల్లో 11 సంవత్సరాలు పనిచేశారు. 1995లో గుజరాత్లోని పోర్ట్ ప్రాజెక్ట్కు జనరల్ మేనేజర్గా ఉన్నారు. ఆ సంస్థ సీఈవోగా ఎదిగారు. ఆ తర్వాత ధోలేర్ పోర్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆయన పని చేశారు. 2015 అక్టోబర్లో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారు. హనీ మిషన్, కుమ్హర్ సశక్తికరణ్ యోజన, తోలు కళాకారుల సాధికారత, ఖాదీ ప్రకృతి పెయింట్ వంటి అనేక వినూత్న పథకాలు, ఉత్పత్తులను ప్రవేశపెట్టారు.
గడిచిన కొన్నేళ్లుగా ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అతితీవ్ర వివాదాలు కొనసాగుతుండటం తెలిసిందే. 2016 డిసెంబర్లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆకస్మికంగా రాజీనామా చేయడంతో అనిల్ బైజల్ పదవిలోకి వచ్చారు. ప్రభుత్వ వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ అతి జోక్యంపై సీఎం కేజ్రీవాల్ పలు మార్లు మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికార పరిధుల వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. 2018లో వారి అధికార పరిధులపై సర్వోన్నత కోర్టు స్పష్టమైన చారిత్రక తీర్పు ఇచ్చింది. కాగా, ఎన్నికల ముందే అనిల్ బైజల్ కూడా ఇటీవల వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడంతో కొత్తగా వినయ్ కుమార్ సక్సేనాను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.