నీలగిరి: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ కొరత కూడా ఎక్కడా కనిపించడం లేదు. కానీ.. కొందరు మాత్రం ఇప్పటికీ ఫస్ట్ డోస్ తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రేపోమాపో థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ అలాంటి వారి తీరు మారడం లేదు. ఇక.. కొందరు మందుబాబుల గురించి అయితే.. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అందరిలో కలిసి తిరుగుతూ.. దావత్ల పేరుతో మద్యం ప్రియులతో కలిసి పార్టీలు చేసుకుంటూ వ్యాక్సిన్ తీసుకోవాలన్న విషయాన్నే మర్చిపోతున్నారు. ఇలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని తమిళనాడు జిల్లా నీలగిరి అధికార యంత్రాంగం నిర్ణయించింది. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఇకపై మద్యం కొనుగోలు చేయాలంటే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి.
తమిళనాడులో ఈ ఆలోచనతో ముందుకొచ్చిన తొలి జిల్లా నీలగిరి కావడం విశేషం. సెప్టెంబర్ 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చింది. వ్యాక్సినేషన్పై అవగాహన కలిగించడంతో పాటు వ్యాక్సిన్ తీసుకోని వారు టీకా తీసుకునేలా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొందరు మందుబాబులు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రాకపోవడానికి కారణం ఉందట. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కనీసం రెండు, మూడు రోజులు ఆల్కహాల్ తాగకూడదని చెబుతుండటంతో ఆ రెండుమూడు రోజులు కూడా ఎక్కడ మందుకు దూరమవుతామేమోనన్న కారణంగా కొందరు మందుబాబులు వ్యాక్సిన్ తీసుకోవడం లేదట.
ఇలాంటి వారికి మద్యం దొరకకుండా చేస్తే కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకుంటారన్నది నీలగిరి జిల్లా అధికార యంత్రాంగం ఆలోచనగా తెలిసింది. ఇప్పటికే నీలగిరి జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికారులు దాదాపుగా విజయవంతం చేశారు. జిల్లాలోని 97 శాతం మందికి వ్యాక్సిన్ను ఇచ్చారు. అయితే.. ఇలా కొందరు మందుబాబులు మాత్రమే వ్యాక్సినేషన్ను 100 శాతం పూర్తి చేయాలని భావిస్తున్న అధికారుల సంకల్పానికి అడ్డు తగులుతున్నారు. దీంతో.. ఇకపై నీలగిరి జిల్లాలో మద్యం కొనాలని టాస్మాక్ దుకాణాలకు వెళ్లే మందుబాబులు.. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉంటేనే మద్యం వాళ్లకు విక్రయిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Alcohol, Corona Vaccine, Corona vaccine first dose, Liquor shops, Vaccination