Yogi To News 18 : ఇవాళ(ఫిబ్రవరి-5,2023)ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(UP CM Yogi Adityanath) నెట్వర్క్ 18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను వెల్లడించారు. నిర్ణీత గడువులోగా రామమందిరం పనులు పూర్తవుతాయని సీఎం యోగి ఆశాభావం వ్యక్తం చేశారు. రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఇటీవల 'రామచరిత మానస్'పై సమాజ్ వాదీ పార్టీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సీఎం యోగి..అభివృద్ధిని కాకుండా విభజనను నమ్ముకునేవారు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారని తెలిపారు. రామచరిత మానస్(Ramacharit manas)పై వివాదాలు రాష్ట్ర అభివృద్ధిపై ప్రజల దృష్టిని మరల్చేందుకు చేస్తున్న ప్రయత్నమని సీఎం అన్నారు. రామచరితమానస్ అత్యంత గౌరవనీయమైన గ్రంథం. ప్రతి ఇంట్లోనూ పూజిస్తారు. దీని ప్రాముఖ్యత తెలియని వారు ప్రశ్నలను లేవనెత్తుతున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కాగా, "తులసీదాస్ రచించిన ఈ రామయణంలోని కొన్ని భాగాలు కులం ప్రాతిపదికన సమాజంలోని విస్తృత వర్గాలను అవమానించేలా ఉన్నాయని,వాటిని తొలగించాలని" యూపీలో ప్రముఖ ఓబీసీ నేతగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య అన్నారు. మౌర్య వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని సమాజ్ వాదీ పార్టీ వివరణ ఇచ్చుకుంది. ఈ అంశంపైనే తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన సీఎం యోగి..సమాజ ఐక్యతకు" మార్గదర్శకంగా నిర్వచించిన హిందూ పవిత్ర గ్రంథాన్ని విమర్శించే వారిపై చర్యలు ప్రారంభించామని చెప్పారు. తాను యోగిని అని, యోగిగా తన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నానని, ప్రజలు తనను వారు కోరుకున్న విధంగా గ్రహించగలరని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
గవర్నెన్స్ ద్వారా అన్ని కమ్యూనిటీలను చేరుకోవచ్చు అని సీఎం యోగి అన్నారు. ఉత్తరప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్,మెరుగైన నిర్వహణ అన్ని కమ్యూనిటీలకు హెల్ప్ చేసిందని తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తుందని యూపీ సీఎం అంచనా వేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 6 ఏళ్లలో 5 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. వచ్చే 2-4 ఏళ్లలో లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయన్నారు.
ఇటీవల విడుదలైన షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్లోని ‘బేషరమ్ రంగ్’ పాట వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం మాట్లాడారు. సినిమా డైరక్టర్లు దీనిని గుర్తించి వ్యవహరించాలన్నారు. పఠాన్ మూవీ సహా పలు సినిమాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న బాయ్ కాట్ పాలిటిక్స్ పై మాట్లాడుతూ..కళాకారులు, పండితులందరినీ గౌరవించాలని.. అయితే అదే సమయంలో ప్రజల మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలను చిత్ర నిర్మాతలు పెట్టకూడదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
ఇక,కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర ఎలాంటి ప్రభావం చూపలేదని, కాంగ్రెస్ దేశానికి విభజన రాజకీయాలను ఇచ్చిందని యూపీ సీఎం అన్నారు. కాంగ్రెస్.. 1947 నుండి భారతదేశాన్ని విభజిస్తోందని అన్నారు. రాహుల్ గాంధీ తన ప్రతికూల వైఖరిని విడిచిపెట్టినట్లయితే, కాంగ్రెస్ లాభపడి ఉండేదన్నారు. మరోవైపు,గత నెలలో సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్కు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన తర్వాత చెలరేగిన వివాదంపై యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ..సమాజ్వాదీ పార్టీ డిక్షనరీలో కృతజ్ఞత లేదని అన్నారు. జోషిమఠ్ లో ఇళ్లు,రోడ్ల పగుళ్ల గురించి యాట్లాడిన సీఎం యోగి..అభివృద్ధి శాస్త్రీయంగా మరియు ప్రణాళికాబద్ధంగా లేకపోతే, అది పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. ప్రకృతితో జోక్యం చేసుకోవడం వల్ల నివారించలేని విపత్తులు వస్తాయన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.