ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. తాజాగా ఆయన ఈవీఎంలో కమలం గుర్తు ముందు ఉన్న మీటా నొక్కినట్లయితే, పాకిస్థాన్ పై బాంబు వేసినట్లే అని ఓటర్లకు పిలుపునిచ్చాడు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ వివిధ రాష్ట్రాలకు చెందిన నేతల్ని ప్రచార బరిలో నిలిపింది. ఈ ఎన్నికల్లో ఆర్టికల్ 370 రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు బీజేపీ నేతలు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఉత్తర్ ప్రదేశ్ వాసులు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని థానే జిల్లాలో ప్రచారంలో పాల్గొన్న ఆయన బీజేపీ ఎన్నికల గుర్తు కమలం ముందు ఉన్న మీటాను నొక్కితే పాకిస్థాన్ పై న్యూక్లియర్ బాంబు పడుతుందని అన్నారు. అంతేకాదు ఈ ఎన్నికలు దేశభక్తి నిరూపించుకునేందుకు ప్రజలకు అందివచ్చిన అవకాశమని అన్నారు.
అలాగే ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని, మహారాష్ట్ర సైతం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలో అభివృద్ధిలో దూసుకెళ్లిందని అన్నారు. లక్ష్మీదేవి కమలం పువ్వులోనే ఆసీనురాలై ఉంటుందని, చేతిలో కానీ, సైకిల్ మీద కానీ, గడియారంపై కానీ ఉండదని, పరోక్షంగా కాంగ్రెస్, ఎన్సీపీ, సమాజ్ వాదీ పార్టీలపై చురకలు వేశారు.
Published by:Krishna Adithya
First published:October 14, 2019, 16:50 IST