UP Police begins bulldozer action : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ వ్యాఖ్యలు నేరస్థుల గుండెళ్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తున్నాయి. అధికారులు ఎక్కడ బుల్డోజర్లతో వచ్చిన తమ భవనాలు కూల్చేస్తారేమోనని నిందితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గడిచిన కొన్ని నెలలుగా ఎన్నికల మీదనే పూర్తి ఫోకస్ పెట్టిన యోగి..ఆ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో విజయం సాధించి యూపీలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే బుల్ డోజర్లకు పెద్ద ఎత్తున పని చెబుతామని.. ఈ విషయంలో తమకు సహకరించాలని కోరటం తెలిసిందే. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని సాధించటం ద్వారా మరోసారి సీఎం పగ్గాలు చేపట్టిన యోగి.. తాజాగా ఎన్నికల సమయంలో తాను చెప్పిన మాటను అక్షరాల నిజం చేసి చూపిస్తున్నారు. నిందితులు, నేరస్తుల గుండెల్లో గుబులు పుట్టేలా ఆయన వ్యవహరిస్తున్నారు. తప్పు చేస్తే ఏ క్షణంలో అధికారులు బుల్డోజర్ ను తమ ఇంటికి తీసుకొస్తారేమో అనే భయం నేరస్తుల్లో నెలకొంది.
ఇటీవల అత్యాచార నేరస్థుల ఇళ్ల ముందు బుల్డోజర్లు పెట్టగా.. కొన్ని గంటల్లోనే చాలా మంది నిందితులు లొంగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా గోరఖ్ పుర్ వ్యాపారవేత్త హత్య కేసులో నిందితుడైన ఇన్స్పెక్టర్ కు చెందిన అక్రమ భవనాన్ని లక్నో డెవలప్మెంట్ అథారిటీ (ఎల్డీఏ) బుల్ డోజర్ తో కూల్చివేసింది. చిన్హట్ ప్రాంతంలో ఉన్న భవనాన్ని కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం కూల్చివేశారు. 'సరైన పత్రాలు లేకుండా నిర్మించిన జగత్ నారాయణ్ సింగ్ పేరు మీద ఉన్న మూడు అంతస్తుల అక్రమ భవనాన్ని ఈ రోజు బుల్డోజర్తో కూలగొట్టాం.' అని ఎల్డీఏ జోనల్ ఆఫీసర్ అమిత్ రాఠోడ్ చెప్పారు. 2021 సెప్టెంబర్ లో గోరఖ్ పుర్ హోటల్లో కాన్పుర్ వ్యాపారి మనీష్ గుప్తాను హత్య చేసిన కేసులో ఎస్ఐ జగత్ నారాయణ్ సింగ్ నిందితుడు. ఈ కేసులో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.
ALSO READ U.S.A Shooting : అమెరికాలో నరమేధం..ఆగంతకుల కాల్పుల్లో 6గురు మృతి,పలువురికి తీవ్ర గాయాలు
మరోవైపు, యూపీలోని షహరాన్ పూర్ లో ఒక మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పరారీలో ఉన్న నిందితుల ఇళ్లను సైతం బుల్ డోజర్లతో అధికారులు కూల్చేశారు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో నిందితులుగా మహమ్మద్ సలీమ్, మహమ్మద్ అమీర్ గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ చలక్ పూర్ గ్రామంలో నివసిస్తూ ఉంటారు. అయితే ఈ ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు కావటంతో వారు పరారీ అయ్యారు. నిందితులు పోలీసులకు లొంగిపోతే సరి.. లేని పక్షంలో మాత్రం ఇంటినికూల్చేస్తామని హెచ్చరించారు. నిందితులు పోలీసుల హెచ్చరికల్ని లైట్ తీసుకోవడంతో పోలీసులు మరింత డోసు పెంచుతూ.. నిందితుల ఇళ్లను పాక్షికంగా కూల్చేశారు. నిందితులు లొంగిపోవాలని వారు ఆదేశాలు జారీ చేశారు. అయినా ఎలాంటి స్పందన లేకపోవటంతో పోలీసులు మరో అడుగు ముందుకు వేసి నిందితుల ఇంటిని బుల్ డోజర్ సాయంతో పూర్తిగా కూల్చేశారు.
తాజాగా రామ్ పుర్ జిల్లాలో ఓ వ్యక్తి..మా ఇంటిని కూల్చేయండి ప్లీజ్ అంటూ ఓ వ్యక్తి ప్రభుత్వానికి లేఖ రాశాడు. రామ్ పుర్ లోని మిత్రపుర్ అరేలాకు చెందిన ఎహసాన్ అనే వ్యక్తి తన ఇంటిని కూల్చేయాలని కోరుతూ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్కు దరఖాస్తు చేసుకున్నారు. సొంత ఇంటిని కూల్చమనటం చూసి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే, ఈ విషయంపై ఆరా తీయగా కొన్నేళ్ల క్రితం చెరువును పూడ్చి ఇంటి నిర్మాణం చేపట్టినట్లు తేలింది. సబ్ కలెక్టర్తో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు లేఖ రాశారు ఆ వ్యక్తి. తన ఇల్లు ప్రభుత్వ భూమిలో ఉందని, అక్రమంగా కట్టిన తన ఇంటిని కూల్చేయాలనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు ఎహసాన్. ఆ ఇంటిని తన ముత్తాత నిర్మించాడని, భూమి పత్రాలను పరిశీలించగా అది చెరువులో ఉన్నట్లు తేలిందని వెల్లడించారు. ఆ కారణంగానే ఇంటిని కూల్చేయాని ఎస్ డీఎమ్ను కోరినట్లు చెప్పారు.
ఇక,యూపీలోని పలు చోట్ల బుల్డోజర్లతో తమ ఇంటిని కూల్చివేస్తారేమోనని భయంతో కొందరు,తమను ఉన్ కౌంటర్ చేయవద్దని వేడుకుంటూ మరికొందరు నేరస్తులు పోలీస్ స్టేషన్ లకు వచ్చి సరెండర్ అవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Uttar pradesh, Yogi adityanath