మనిషిని కుక్క కరవడం కాదు.. మనిషే కుక్కను కరిస్తే అదీ అసలైన వార్త! అనే నానుడి ఎలుకల విషయంలో రివర్స్ అవుతోంది. పంట పొలాలను ధ్వంసం చేయడంలో ఆరితేరిన ఎలుకలు చాలా సందర్భాల్లో మనుషుల మరణాలకూ కారణమవుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలుకల కాట్లకు పేదరోగుల ప్రాణాలు పోయిన ఉదంతాలున్నాయి. అయితే తాజా ఘటనలో ప్రాణహాని జరగప్పటికీ ఏకంగా మంత్రిగారినే ఏలుక కరవడం కలకలం రేపింది. ముఖ్యమంత్రి మరో ఉద్దేశంతో తీసుకున్న కఠిన నిర్ణయమే ఈ ఘటనకు మూల కారణంగా పరిణమించింది. పూర్తి వివరాలివే..
ఉత్తరప్రదేశ్ లో మంత్రి గారిని ఎలుక కరిచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గాఢ నిద్రలో నుంచి సడన్ గా లేచిన ఆయన.. తనను పాము కరించిందేమోనని భయాందోళనకు గురై ఆస్పత్రికి పరుగులు తీశారు. విలాసవంతమైన మంత్రి గారి ఇంట్లో ఎలుకలు స్వైర విహారం చేశాయేమోనని భావిస్తే గనుక మనం మళ్లీ పొరబడ్డట్టే. మంత్రిగారు ఎలుక కాటుకు గురైంది ఓ ప్రభుత్వ విశ్రాంతి భవనంలో..
యూపీ క్రీడల శాఖ మంత్రి గిరీశ్ చంద్ర యాదవ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం బాందా జిల్లాకు వచ్చారు. ఉదయం పూట అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని రాత్రి వేళ ప్రభుత్వ విశ్రాంతి భవనంలో విడిది చేశారు. నిజానికి అక్కడ పెద్ద సౌకర్యాలేవీ లేవు. కానీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల అనుసారం మంత్రిగారు ప్రభుత్వ బంగాళాలోనే పడుకోక తప్పలేదు.
యూపీలో ఆర్థిక క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సీఎం యోగి ఇటీవల కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుననారు. మంత్రులు, ఉన్నతాదికారులు జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు స్థానికంగా ఉండే స్టార్ హోటళ్లకు వెళ్లరాదని, పార్టీ నేతల ఇళ్లలోనో బస చేయకూడదని, కచ్చితంగా ప్రభుత్వ బంగాళాలు, గెస్ట్ హౌజులనే వినియోగించాలన్నది సీఎం నిర్ణయాల్లో ప్రధానమైనది. మంత్రులు తమ బంధువులను పీఏలుగా పెట్టుకోరాదనీ సీఎం నిర్దేశించారు. గత నెలలో రెండోసారి సీఎం అయ్యాక యోగి తీసుకున్న ఈ నిర్ణయాలు తూచా తప్పకుండా అమలవుతున్నాయి. అయితే మంత్రి గిరీశ్ విషయంలో మాత్రం విషయం కాస్త వింత అనుభవంగా మారింది..
మావై బైపాస్ ప్రాంతంలోని ప్రభుత్వ గెస్ట్ హౌజులో మంత్రిగారు నిద్రించగా, రాత్రి వేళ ఆయనను ఎలుకలు కొరికాయి. గాఢనిద్రలో నుంచి సడన్ గా లేచిన మంత్రి.. తన కాలికైన గాయాన్ని చూసి పాము కాటేసేందేమోనని భయాందోళనకు గురయ్యారు. గదిలో నుంచే కేకలు వేయడంతో సిబ్బంది పరుగున వెళ్లారు. అప్పటికప్పుడే అంబులెన్స్ ను రప్పించి, బాందా జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి వెళ్లారు. చివరికి..
వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత మంత్రిని కరించిన పాము కాదని, ఎలుక కొరికిందని తేల్చిచెప్పారు. కానీ అప్పటికే మంత్రిగారికి బీపీ పెరిగి ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. కొంత విశ్రాంతి తర్వాత కుదురుకోవడంతో కాలికి పట్టీ కట్టి, డిశ్చార్జీ చేశారు. స్టార్ హోటళ్లలో బస చేసే మంత్రులు.. సీఎం నిర్ణయం కారణంగా పాడుబడ్డ ప్రభుత్వ భవంతుల్లో ఉండాల్సి రావడం, సామాన్య పేదల మాదిరిగా ఎలుక కాటుకు గురికావడం చర్చనీయాంశమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ministers, Rats, Uttar pradesh, Yogi adityanath