PM Modi On Rafale Attacks : కర్ణాటకలోని తుమకూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)..గ్రీన్ ఫీల్డ్ హెలికాప్టర్ తయారీ కర్మాగారాన్ని(Greenfield helicopter factory) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఈ రోజు ప్రారంభించారు. ఇది భారతదేశపు అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రంగా ఉంది. ప్రారంభంలో లైట్-యుటిలిటీ హెలికాప్టర్లను (LUHs) ఉత్పత్తి చేస్తుంది. LUH అనేది దేశీయంగా రూపొందించబడిన, అభివృద్ధి చేయబడిన 3-టన్నుల తరగతి, ఒకే-ఇంజిన్ మల్టీపర్పస్ యుటిలిటీ హెలికాప్టర్, ఇది అధిక యుక్తులతో కూడిన ప్రత్యేక లక్షణాలతో ఉంటుంది. ప్రారంభ దశలో కర్మాగారం సంవత్సరానికి సుమారు 30 హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తుంది. తరువాత దాని సామర్థ్యాన్ని దశలవారీగా సంవత్సరానికి 60 మరియు 90 హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తుంది.
అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటకలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు అధికారిక కార్యక్రమంలో విపక్షాలను టార్గెట్ చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్కు ప్రయోజనం చేకూరుస్తోందని, ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ దిగ్గజం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)ను నాశనం చేస్తోందని ప్రతిపక్షాల ఆరోపణలను ప్రధాని మోదీ ఉదహరించారు. HAL గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేయబడిందని,తమ ప్రభుత్వంపై చాలా తప్పుడు ఆరోపణలు చేశారని,పార్లమెంటు యొక్క అనేక పని గంటలను దాని కోసం వృధా చేశారని పరోక్షంగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. " తుముకూరులోని HAL యొక్క హెలికాప్టర్ ఫ్యాక్టరీ, దాని పెరుగుతున్న శక్తి తప్పుడు ఆరోపణలు చేసిన వారి తప్పుడు ఆరోపణలను బట్టబయలు చేస్తుంది. HAL..రక్షణలో స్వావలంబనను(Self reliance) పెంచుతోంది. ప్రతిపక్షాల ఆరోపణలకు తుముకూరులోని ఈ ఫ్యాక్టరీ ఓ సమాధానం.. ఈరోజు నిజం బయటపడుతోంది"అని మోదీ అన్నారు.
Pm Modi: కర్ణాటకలో హెచ్ఏఎల్ హెలికాప్టర్ తయారీ ఫ్యాక్టరీని ప్రారంభించిన ప్రధాని మోదీ
ఫ్రెంచ్ సంస్థ నుండి రాఫెల్ విమానాల కొనుగోలుకు రూ.59,000 కోట్ల ఒప్పందంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించింది. చౌకీదార్ చోర్ హై (కాపలాదారు ఒక దొంగ) ప్రచారంతో ప్రధానమంత్రిపై విమర్శలు గుప్పించాయి విపక్షాలు.రాఫెల్ ఒప్పందం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్కు ప్రయోజనం చేకూర్చిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ హయాంలో ఖరారు చేసినట్లుగా ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ దిగ్గజం హెచ్ఎఎల్ ఎందుకు ఇందులో ప్రమేయం లేదని ప్రశ్నించింది. ప్రధాని మోదీ ప్రభుత్వం హెచ్ఏఎల్ను నాశనం చేస్తోందని, హెచ్ఏఎల్ నుంచి కాంట్రాక్టును లాగేసుకొని కర్ణాటక ప్రజల నుంచి ఉద్యోగాలను లాక్కుంటోందని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ గతంలో ఆరోపించారు. అయితే రాఫెల్ డీల్ లో అవకతవకలు జరిగాయంటూ నవంబర్ 2020లో కాంగ్రెస్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. రాఫెల్ డీల్పై ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Karnataka, Pm modi, Rafale Deal, Rahul Gandhi