సజీవ సమాధికి అనుమతి ఇవ్వాలని కోరుతూ స్వామి వైరాగ్యానంద భోపాల్ కలెక్టర్కు దరఖాస్తు చేసుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో భోపాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన దిగ్విజయ్ సింగ్ గెలుపు తథ్యమని, అలా జరగకపోతే, తాను సమాధిలోకి వెళ్తానని ఎన్నికలకు ముందు జోస్యం చెప్పారు స్వామి వైరాగ్యానంద. ఎన్నికల్లో దిగ్విజయ్ ఓడిపోయినా... స్వామి వైరాగ్యానంద సమాధిలోకి వెళ్లకపోవడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. దీంతో ఆయన సజీవ సమాధికి అనుమతి ఇవ్వాలని కలెక్టర్కు దరఖాస్తు చేసుకున్నారు. తన లాయర్ ద్వారా కలెక్టర్కు దరఖాస్తు చేసుకున్న వైరాగ్యానంద... దిగ్విజయ్ గెలుపు కోసం తాను యాగం చేశానని అందులో తెలిపారు.
ఒకవేళ ఆయన ఓడిపోతే తాను సజీవ సమాధి అవుతానని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఈ నేపథ్యంలో జూన్ 16న మధ్యాహ్నం రెండు గంటలకు తాను సజీవ సమాధి కావాలని భావిస్తున్నానని దరఖాస్తులో వివరించారు. తన సెంటిమెంట్లను గౌరవించి... అధికారులు ఈ విషయంలో తనకు సహకరించాలని కోరారు. అయితే దీనిపై కలెక్టర్ తరుణ్ కుమార్ పితోడ్ డీఐజీకి లేఖ రాశారు. తాము వైరాగ్యానంద సజీవ సమాధి కోసం ఎలాంటి అనుమతీ ఇవ్వలేదని అన్నారు. ఆయన ప్రాణానికి ఎలాంటి హానీ కలుగకుండా చూసుకునేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. ఇక వైరాగ్యనంద దిగ్విజయ్ సింగ్ గెలుస్తారని జోస్యం చెప్పగా... ఆయనపై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సాథ్వి ప్రజ్ఞాసింగ్ మూడున్నర లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
Published by:Kishore Akkaladevi
First published:June 15, 2019, 13:21 IST