పాకిస్తాన్ తో సరిహద్దులు కలిగిన పంజాబ్ లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మొహాలీ సిటీలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై రాకెట్ లాంఛర్లతో దాడి జరిగింది. ఇది ఉగ్రవాదుల పనే అని అధికారులు అనుమానిస్తున్నారు. పంజాబ్ ఇంటెల్ హెడ్ క్వార్టర్స్ లో సోమవారం రాత్రి ఆఫీసులోని మూడో అంతస్తును లక్ష్యంగా చేసుకుని రాకెట్ లాంచర్తో దాడి చేశారని ఎస్పీ రవీంద్ర పాల్ సింగ్ తెలిపారు.
ఈ ఘటనలో ప్రాణ నష్టం లేనప్పటికీ, కార్యాలయంలోని కొంత భాగం ధ్వంసమైంది. పంజాబ్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన భవనం మొహాలీ సెక్టార్ 77, SAS నగర్లోని సుహానా సాహిబ్ గురుద్వారా సమీపంలో ఉంటుంది. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో జరిగిన రాకెట్ దాడి జరిగినట్లు ఇంటెలిజెన్స్ వింగ్ వర్గాలు చెబుతున్నాయి.
‘నెట్టో' అని పిలిచే RPG-22 రకం సింగిల్ షాట్ డిస్పోజబుల్ సోవియట్ యాంటీ-ట్యాంక్ రాకెట్ లాంచర్ ద్వారా గ్రనేడ్లు ప్రయోగించినట్లు అధికారులు భావిస్తున్నారు. మొహాలీలోని పంజాబ్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ వార్హెడ్ను ప్రయోగించారు. అయితే ఆ రాకెట్ పేలక పోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు.
మొహాలీలోని పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం ముఖ్య కార్యాలయంపై దాడి ఘటన తర్వాత పంజాబ్ సీఎం భగవంత్ మాన్ డీజీపీతో మాట్లాడి ఘటనపై పూర్తి సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. దీంతో పాటు ఫోరెన్సిక్ బృందాలను కూడా ఘటన స్థలం చేరుకుని ఆధారాలను సేకరిస్తోంది. పంజాబ్ సీఎం.. కేంద్రంతోనూ ఈ విషయంపై మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Attack, BLAST, Punjab, Terrorists