TAJMAHAL NEWS LUCKNOW HIGH COURT BENCH REPRIMANDS ON PIL OF OPENING TAJ MAHAL ROOMS SAYS DO PROPER RESEARCH FIRST SK
Taj Mahal: తాజ్ మహల్ గదులను తెరిపించాలన్న పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
తాజ్ మహల్
Taj Mahal: తాజ్ మహల్లో మూసిఉన్న గదులను తెరిపించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. తాజ్మహల్ గురించి పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే పిల్ వేయాలని స్పష్టం చేసింది.
దేశంలో కొన్ని రోజులుగా తాజ్ మహల్ (Taj Mahal) గురించి చర్చ జరుగుతోంది. అది తేజో మహాలయ అని.. తాజ్ మహల్లో ఉన్న గదుల్లో హిందూ విగ్రహాలున్నాయని కొన్ని వర్గాలు వాదిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజ్ మహల్ గదులను తెరిపించాలని అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court)లో పిల్ దాఖలయింది. హైకోర్టులో పిల్ దాఖలవడంతో దేశవ్యాప్తంతా తాజ్ మహల్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఐతే గురువారం అలహాబాద్ హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. తాజ్మహల్పై పూర్తి స్థాయి పరిశోధన చేసిన తర్వాతే.. పిల్ వేయాలని పిటిషనర్ని మందలిచింది. పిల్ను ఎగతాళి చేయవద్దని..కనీసం అవగాహన లేకుండా.. ఇష్టానుసారం పిల్ వేస్తారా? అని మండిపడింది. ముందు తాజ్మహల్ను ఎవరు నిర్మించారు? ఎప్పుడు కట్టారన్న వివరాలు తెలుసుకోవాలని చివాట్లు పెట్టింది.
తాజ్మహల్ ముంతాజ్ స్మారకం కాదని ఒకప్పటి హిందూ దేవాలయమని ఓ వాదన విస్తృతంగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. దాని గుట్టు విప్పాలంటూ ఇటీవల అలహాబాద్ హైకోర్టులో ఓ పిల్ దాఖలయింది. నాలుగు అంతస్థుల తాజ్ మహల్లోని కింది రెండు అంతస్థుల్లోనూ ఉన్న గదుల్లో సుమారు 22 గదులను శాశ్వతంగా మూసేశారని, తాజ్ మహల్లో తాళం వేసి ఉన్న 22 గదుల తలుపులను ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ద్వారా తెరిపించాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ను ఓ వ్యక్తి ఆశ్రయించారు. ఈ గదుల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మూసి ఉన్న గదుల తలుపులు తెరవాలని పిటిషన్లో కోరారు. ఇందుకోసం ASI చేత నిజ నిర్ధారణ జరిపించాలని పిటిషనర్ పేర్కొన్నారు.
ఈ కమిటీ నివేదికను కోర్టుకు సమర్పించేలా, కోర్టు సమక్షంలోనే ఆ నివేదికను బహిర్గతం చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఇది మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్ అని చాలామంది చరిత్రకారులు విశ్వసిస్తున్నప్పటికీ.. కొందరు మాత్రం ఇది తేజో మహాలయ, తాజ్ మహల్ జ్యోతిర్లింగం అని నమ్ముతున్నారని పేర్కొన్నారు. దశాబ్దాల కాలంగా మూసి ఉన్న ఆ గదుల లోపల హిందూ దేవుళ్ల విగ్రహాలు ఉన్నట్లు అనేక మంది చరిత్రకారులు, కోట్లాది మంది హిందువులు విశ్వసిస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఆ గదుల్లోనే పరమేశ్వరుడు కొలువుదీరి ఉన్నారని నమ్ముతున్నట్లు పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అంతేకాదు భద్రతా కారణాల వల్లే ఆ గదులను మూసినట్లు ఆగ్రాలోని పురావస్తు శాఖ ఇచ్చిన నివేదికను సైతం పిటిషనర్ కోర్టుకు సమర్పించారు. ఇన్ని ప్రశ్నల నేపథ్యంలో వాటి గుట్టును విప్పేందుకు కోర్టుకు చొరవ తీసుకోవాలని పిటిషనర్ కోర్టుని కోరారు. ఐతే ఆ పిల్ను కొట్టివేస్తూ.. పిటిషనర్కి షాకిచ్చింది హైకోర్టు.
మరోవైపు రాజస్థాన్ రాజకుటుంబానికి చెందిన దియా కుమారి (Diya Kumari) కూడా తాజ్ మహల్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజ్మహల్ ఉన్న స్థలం తమ పూర్వీకులదని, అది తమ వారసత్వ సంపదని చెప్పారు. ఆ భూమికి సంబంధించిన పత్రాలను తమ పొతిఖానాలో ఉంచారని ఆమె పేర్కొన్నారు. తమ పూర్వీకుల భూమిని మొగల్ రాజు తీసుకొని.. అక్కడ తాజ్ మహల్ని నిర్మించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజ్మహల్లో మూసి ఉన్న గదులను వెంటనే తెరవాలని ఆమె డిమాండ్ చేశారు. దియా కుమారి బీజేపీ ఎంపీగా ఉన్నారు. రాజస్థాన్లోని రాజ్ సమంద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె వ్యాఖ్యలు కూడా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మాారాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.