ఇండియా-పాకిస్తాన్ బోర్డర్లో తాజా పరిస్థితులపై భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ (LOC) వెండి ఏ క్షణమైనా పరిస్థితులు తీవ్రతరం కావచ్చని బుధవారం వెల్లడించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉందని తెలిపారు. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ వైపు నుంచి కవ్వింపులు ఎక్కువయ్యాయని.. యథేచ్ఛగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందన్న నివేదికల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఎల్వోసీ వెంబడి పరిస్థితులపై కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్లో మాట్లాడారు. ఆగస్టు నుంచి అక్టోబరు మధ్య కాలంలో 950 సార్లు పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందని చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సరిహద్దులో పాకిస్తాన్ పెద్ద కుట్రకే ప్లాన్ చేస్తోందన్న అనుమానాలు కలుగుతున్నాయి.
కాగా, డిసెంబరు 16న పూంచ్ సెక్టార్లో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన BAT (బోర్డర్ యాక్షన్ టీమ్) చొరబాట్లకు యత్నించింది. ఈ క్రమంలో భారత ఆర్మీ పోస్టులపై దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం ఎదురు దాడి చేసింది. ఇరువర్గాల మధ్య రాకెట్ లాంచర్లు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్లో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ భీకర పోరులో భారత ఆర్మీకి చెందిన రైఫిల్ మ్యాన్ సుఖ్విందర్ సింగ్ మరణించారు. ఇక పాకిస్తాన్కు చెందిన ఇద్దరు ఎస్ఎస్జీ కమాండోలు హతమయ్యారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యల నేపథ్యంలో LOC వెంబడి హైఅలర్ట్ ప్రకటించి భద్రతను పటిష్టం చేసింది భారత ఆర్మీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Army Chief General Bipin Rawa, Indian Army, Jammu and Kashmir, Pakistan