Incentives who produce more children : ఇప్పటికే మనదేశం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న జనాభాతో కిటకిటలాడుతోంది. రాబోయే రోజుల్లో చైనాను కూడా దాటి పోయి జనాభా పరంగా ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా భారత్ అవతరించబోతోంది. అలాంటి మన దేశంలో ఎక్కువ మంది పిల్లల్ని కంటే అనేక ప్రోత్సహకాలు ఇస్తున్నట్లు ఓ రాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. పిల్లలను కంటే ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇస్తారంట. సంవత్సరం పాటు ప్రసూతీ సెలవులు, తండ్రికి కూడా సెలవులు ఇచ్చేస్తారంట. అంతేకాదండోయ్ ప్రభుత్వ పిల్లలు పుడితే జీతాలు కూడా పెంచుతారంట. ఇద్దరు పిల్లలకు ఒక ఇంక్రిమెంట్, ముగ్గురు పిల్లలకు డబుల్ ఇంక్రిమెంట్ ఇచ్చేస్తారంట. అయితే అసలు సిక్కిం ప్రభుత్వం ఇలాంటి ప్రకటన ఎందుకు చేసిందో చూద్దాం.
మాఘే సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆదివారం సిక్కింలోని జోరెథాంగ్ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్.. సిక్కిం సంతానోత్పత్తి రేటు ఇటీవలి భారీగా తగ్గిందన్నారు. అత్యల్ప వృద్ధి రేటును నమోదు చేసిందని, సిక్కిం జాతి జనాభా క్షీణించిందన్నారు. గత ప్రభుత్వాలు ఒకే బిడ్డ నినాదంతో ముందుకెళ్లాయని..తద్వారా ఇప్పుడు రాష్ట్ర జనాభా 7 లక్షలుగా ఉందని, గత ప్రభుత్వాల నిర్ణయాల ఫలితమే నేడు రాష్ట్ర జనాభా క్షీణించిందని సీఎం తమాంగ్ అన్నారు. రాష్ట్ర జనాభాను పెంచే ఆవశ్యకత ఉందని, ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ప్రయత్నించాలని సూచించారు. సంతనోత్పత్తి రేటు చాలా తగ్గిపోయిందని విచారం వ్యక్తం చేస్తూ పిల్లల్ని కనే ఉద్యోగులకు సీఎం ప్రోత్సాహాకాలు ప్రకటించారు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగినులు ఎక్కువ మంది పిల్లల్ని కంటారో వారికి ఎక్కువ ప్రోత్సాహకాలు అందుతాయని తెలిపారు. ఇద్దరు పిల్లల్ని కంటే ఒక ఇన్సెంటీవ్, ముగ్గురు పిల్లల్ని కన్నవారికి డబుల్ ఇక్రిమెంట్ తో పాటు ఎక్కువ సెలవులు తీసుకునేందుకు కూడా అనుమతిస్తామని కూడా చెప్పారు. ఒక బిడ్డ మాత్రమే ఉన్న మహిళకు ఈ ఆర్థిక ప్రయోజనం అందుబాటులోకి రాదని తమంగ్ స్పష్టం చేశారు.
గూస్ బంప్స్ తెప్పించే విమాన ప్రమాదం..29 మంది మృతి,మృతదేహాలు తిని బతికిన మిగతా ప్రయాణికులు!
తమ ప్రభుత్వం ఇప్పటికే స్త్రీలకు 365 రోజుల ప్రసూతి సెలవులను అందజేస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. తండ్రి అయిన పురుషులకు కూడా పితృత్వ సెలవులు ఇస్తామన్నారు. ఎక్కువమంది పిల్లలను కనేందుకు సామాన్య ప్రజలకు కూడా ఆర్థిక సాయాన్ని అందజేస్తామని ప్రకటించారు సీఎం తమాంగ్. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే ఆరోగ్య, మహిళా శిశు సంరక్షణ శాఖలు వెల్లడిస్తాయని తెలిపారు. ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనే ఉద్యోగినులకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని సీఎం తమాంగ్ తెలిపారు. ఐవీఎఫ్ సౌకర్యం ద్వారా ఇప్పటివరకు 38 మంది మహిళలు గర్భం దాల్చారని, కొందరు తల్లులు కూడా అయ్యారని తెలిపారు. మహిళలు కృత్రిమంగా గర్భం దాల్చేలా ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం సిక్కింలోని ఆస్పత్రుల్లో ఐవిఎఫ్ సౌకర్యాన్ని కూడా ప్రారంభించిందని సీఎం తమాంగ్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Infertility, Sikkim