బెంగళూరు: కరోనా సెకండ్ వేవ్లో అత్యధిక కేసులు నమోదైన కర్ణాటకలో గత కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో.. ప్రభుత్వం లాక్డౌన్ నుంచి సడలింపులు ప్రకటించింది. జూలై 5 నుంచి ఈ సడలింపులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. అన్లాక్-3లో భాగంగా కర్ణాటకలో జూలై 5 నుంచి మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్లు తెరుచుకోనున్నాయి. అంతేకాదు.. ఇకపై వీకెండ్ కర్ఫ్యూ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మెట్రో, బస్సుల్లో 100 శాతం సీటింగ్కు అనుమతినిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య కార్యకలాపాలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే.. కరోనా కేసులు పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకూ రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దేవాలయాల్లో భక్తులకు దర్శనాలకు అనుమతి ఉంది. పబ్లు, సినిమా థియేటర్లకు అనుమతినివ్వలేదు. విద్యా సంస్థల ప్రారంభంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు యడియూరప్ప ప్రభుత్వం తెలిపింది. వివాహాలలో వంద మంది పాల్గొనేందుకు అనుమతినిచ్చారు. అంత్యక్రియలకు 20 మందికి మించి పాల్గొనేందుకు అనుమతి లేదు. బార్లు, వైన్ షాపులు రాత్రి 9 గంటల వరకూ తెరుచుకునేందుకు అనుమతి ఉంది. స్విమ్మింగ్పూల్స్లో శిక్షణ పొందే క్రీడాకారులకు మాత్రమే అనుమతినిచ్చారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్రమంతటా వర్తించే ఆంక్షలు కొడగు జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఆ జిల్లాకు మాత్రం ప్రస్తుతానికి వర్తించవని సీఎం యడియూరప్ప నేతృత్వంలోని ప్రభుత్వం స్పష్టం చేసింది. గడచిన 24 గంటగల్లో కర్ణాటకలో మొత్తం 2,082 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. 86 మంది కరోనా వల్ల చనిపోయారు. కర్ణాటకలో పాజిటివిటీ రేటు 1.34 శాతానికి తగ్గింది. కర్ణాటకలో నమోదైన 2,082 కేసుల్లో ఒక్క బెంగళూరు నగరంలోనే 481 కరోనా కేసులు నమోదయినట్లు వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే.. కర్ణాటకను మిస్సి వ్యాధి బెంబేలెత్తిస్తోంది.
దావణగెరెలో మొత్తం 10 మిస్సి కేసులు నమోదు కాగా.. అందులో 8 మంది కోలుకున్నారు. ఇద్దరికి చికిత్సనందిస్తుండగా.. వారిలో ఒక చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది. కరోనా సోకి.. ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న చిన్నారుల్లో మిస్సి వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. రక్తపోటు ఇబ్బందులు, శ్వాసకోశ ఇబ్బందులు, న్యూమోనియా లక్షణాలు మిస్సి వ్యాధి బారిన పడిన వారిలో కనిపిస్తాయి. అవయవాలు విఫలమయి చనిపోయే పరిస్థితి వస్తుంది. ఈ జబ్బు నుంచి కోలుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కోవిడ్ బారిన పడి కోలుకున్న చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bengaluru, Karnataka, Lockdown, Lockdown relaxations