Service Charge Row: హోటళ్లు(Hotels), రెస్టారెంట్లు(Restaurants) సర్వీస్ ఛార్జీ(Service Charge)ని విధించకుండా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ హోటల్, రెస్టారెంట్ల యజమానులు ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)ను ఆశ్రయించారు. విచారణ సందర్భంగా కోర్టు కేంద్రం ఉత్తర్వులపై స్టే విధించింది. ఉత్తర్వులపై సింగిల్ జడ్జి బెంచ్ను ఆశ్రయించాలని కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు సూచించింది. ఆగస్టు 31న తదుపరి విచారణ వరకు వినియోగదారులపై సర్వీస్ ఛార్జీ విధించడం కొనసాగుతుంది. ఈ సర్వీస్ ఛార్జీని విధించే అంశంపై వరుసగా చోటుచేసుకున్న పరిణామాలు ఇవే..
అసలు సమస్య ఏంటి?
హోటల్లు, రెస్టారెంట్లు కస్టమర్లపై బిల్లు కంటే 5-10 శాతం వరకు సర్వీస్ ఛార్జీని విధిస్తాయి. రెస్టారెంట్లు అటువంటి ఛార్జీని తప్పనిసరి చేయడంపై వినియోగదారుల నుంచి వినియోగదారుల వ్యవహారాల విభాగానికి ఫిర్యాదులు వస్తున్నాయి. సర్వీస్ ఛార్జీ గురించి ప్రశ్నించిన వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినియోగదారులు పేర్కొన్నారు. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. జూన్ 2న రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులతో సమావేశం నిర్వహించారు. సర్వీస్ ఛార్జీని చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. ఈ పద్ధతిని వెంటనే నిలిపివేయాలని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(NRAI)కి సూచించారు.
జులై 4న, హోటల్లు, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీని విధించడం అన్యాయమైన వాణిజ్య పద్ధతిగా సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA) పేర్కొంది. వినియోగదారుల హక్కుల ఉల్లంఘనను నిరోధించడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార బిల్లులో ఆటోమేటిక్గా లేదా డిఫాల్ట్గా సర్వీస్ ఛార్జీని యాడ్ చేయకూడదని మార్గదర్శకాలు నిర్దేశించాయి. హోటల్, రెస్టారెంట్ల యజమానులు ఢిల్లీ హైకోర్టులో మార్గదర్శకాలను సవాలు చేశారు. ఆ తర్వాత కోర్టు వారికి అనుకూలంగా ఆదేశాలు ఇస్తూ.. జులై 20న మార్గదర్శకాలపై స్టే విధించింది.
ప్రభుత్వం ఏం చెబుతోంది?
రెస్టారెంట్లు విధించే సర్వీస్ ఛార్జీని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ చట్టవిరుద్ధమని పేర్కొంది. వినియోగదారుల నుంచి వసూలు చేసే ఈ లెవీకి ఎటువంటి చట్టపరమైన అనుమతి లేదని తెలిపింది. దీనికి సంబంధించి ప్రభుత్వం చట్టపరమైన సూత్రీకరణతో ముందుకు వస్తుందని పేర్కొంది.
మే నెలాఖరులో ఎన్ఆర్ఎఐకి రాసిన లేఖలో, వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ..‘రెస్టారెంట్లు డిఫాల్ట్గా వినియోగదారుల నుంచి సేవా ఛార్జీని వసూలు చేస్తున్నాయి. అటువంటి ఛార్జీల చట్టబద్ధతపై వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. బిల్లు నుంచి అటువంటి ఛార్జీలను తీసివేయమని కోరిన వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నారు. ఈ సమస్య రోజువారీ ప్రాతిపదికన వినియోగదారులను పెద్దగా ప్రభావితం చేస్తుంది. వినియోగదారుల హక్కులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని డిపార్ట్మెంట్ భావించింది.’ అని పేర్కొన్నారు.
Free Smartphone : ప్రభుత్వం కొత్త స్కీమ్..మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు,ఫ్రీ ఇంటర్నెట్
హోటల్లు, రెస్టారెంట్లు ఏం చెప్పాయి?
జూన్ ప్రారంభంలో జరిగిన సమావేశంలో, బిల్లో సర్వీస్ ఛార్జీని పేర్కొన్నప్పుడు తప్పనిసరిగా వినియోగదారులు చెల్లించాలని చెబుతున్నట్లని ప్రభుత్వం చేసిన వాదనలను రెస్టారెంట్ అసోసియేషన్లు వ్యతిరేకించాయి. సర్వీస్ ఛార్జీని రెస్టారెంట్లు/హోటల్లు సిబ్బందికి, కార్మికులకు చెల్లించడానికి ఉపయోగిస్తాయని చెప్పారు. రెస్టారెంట్/హోటల్ ద్వారా వినియోగదారునికి అందించే ఎక్స్పీరియన్స్, ఆహారం కోసం కాదని తెలిపాయి.
జూన్లో NRAI చేసిన ఓ ట్వీట్లో..‘సర్వీస్ ఛార్జీ చట్టబద్ధతకు సంబంధించి ఈరోజు జరిగిన వినియోగదారుల వ్యవహారాల శాఖ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించి మీడియా నివేదికలు అవాస్తవం. డిపార్ట్మెంట్ అన్ని వాటాదారుల అభిప్రాయాలను విన్నది. ఈ విషయంపై నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఇన్పుట్లను సమీక్షిస్తుంది. సర్వీస్ ఛార్జీ ఇప్పటికీ చట్టబద్ధమైంది.’ అని పేర్కొంది.
ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్లో ఇండస్ట్రీ బాడీ ఇలా పేర్కొంది..‘సర్వీస్ ఛార్జీ విధించడం అనేది 80 సంవత్సరాలకు పైగా హాస్పిటాలిటీ పరిశ్రమలో స్టాండింగ్ ప్రాక్టీస్గా ఉంది. ఈ కాన్సెప్ట్ను సుప్రీం కోర్టు చాలా కాలం క్రితం 1964లో నోటీసు చేసింది.’ అని తెలిపింది.
కోర్టు ఏం చెప్పింది?
జులై 20న సర్వీస్ ఛార్జీని నిషేధిస్తూ వచ్చిన మార్గదర్శకాలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. డోంట్ పే, డోంట్ ఎంటర్ రెస్టారెంట్ అని రెస్టారెంట్లో బోర్డులు ఏర్పాటు చేయలేని కేసును విచారించిన జస్టిస్ యశ్వంత్ వర్మ పేర్కొన్నారు.
గురువారం(ఆగస్టు 18) ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్లతో కూడిన ధర్మాసనం, మార్గదర్శకాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సింగిల్ జడ్జి బెంచ్ ముందు సమర్పించడానికి కేంద్రం, సీసీపీఏను అనుమతించింది. కేసును తిరిగి ఆగస్టు 31న విచారిస్తామని తెలిపింది.
డివిజన్ బెంచ్ రెస్టారెంట్లకు.. ఉద్యోగులకు చెల్లించడానికి రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జీలు విధించాల్సిన అవసరం లేదని, వివిధ చట్టాల ప్రకారం ఉద్యోగులకు చెల్లించేందుకు యజమానులు కట్టుబడి ఉన్నారని కోర్టు రెస్టారెంట్లకు సూచించింది. అయితే రెస్టారెంట్లు ప్రస్తుతానికి కస్టమర్లపై సర్వీస్ ఛార్జీలు విధించవచ్చని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hotels, Service charges