బీహార్ లోని రోహతాస్ జిల్లాలో గల సాసారాం రైల్వే జంక్షన్.. ఇతర ప్రయాణికుల వరకైతే ఓ సాదారణ రైల్వే స్టేషన్. కానీ, చుట్టుపక్కల ఊర్లలో చదువుకునే పిల్లలకు మాత్రం సదరు స్టేషన్ విద్యాలయం కంటే ఎక్కువ. రైల్వే ఫ్లాట్ ఫారమే వారికి కోచింగ్ సెంటర్. ఉదయం, సాయంత్రం వేళలో కొన్ని వందల మంది యువతీయువకులు ఈ రైల్వేస్టేషన్కు క్యూ కడుతుంటారు. ఉన్న రెండు ఫ్లాట్ ఫారాలు విద్యార్థులతో నిండిపోయి కనిపిస్తాయి. .
సాసారాం జంక్షన్ లోని రెండు రైల్వే ఫ్లాట్ ఫారాలపై సొంతగా చదువుకునే పిల్లలు కొందరైతే, కోచింగ్ తరహాలో గ్రూపులుగా ఏర్పడి చదివేవాళ్లూ కనిపిస్తారు. సబ్జెక్టులో పట్టున్న, వయసులో పెద్దవాళ్లైన కొందరు.. మిగతా వాళ్లకు (బోర్డు లేకుండానే క్లాసులు) తీసుకునే దృశ్యాలూ అగుపిస్తాయక్కడ. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత ఆ స్టేషన్ అచ్చంగా చదువల కోవెలగా మారిపోతుంది. నిజానికి..
సాసారాం రైల్వే స్టేషన్ పేద విద్యార్థుల పాలిట కోచింగ్ సెంటర్ గా మారిన సందర్భం ఈనాటిది కాదు. పేదరికానికి పేదరికానికి చిరునామా అయిన రోహతాస్ జిల్లాలో ఇప్పటికీ చాలా ఊర్లకు కరెంటు సదుపాయం లేదు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన సాసారాంలో ఒక్క రైల్వే స్టేషన్ కు తప్ప చుట్టుపక్కల ఊళ్లన్నీ రాత్రి వేళ చీకట్లోనే మగ్గిపోతున్నాయి. సాసారాం రైల్వే స్టేషన్లో మాత్రమే 24గంటల కరెంట్ ఉంటుంది. ఆయా గ్రామాల్లో చదువులపై ఆసక్తిగల పిల్లలంతా ఈ సౌకర్యాన్ని అనుకూలంగా మలుచుకున్నారు. 2002 సంవత్సరం నుంచి ఇలా విద్యార్థులంతా కలిసి రైల్వే స్టేషన్ లైట్ల కింద చదువుకోవడం మొదలైంది. ప్రస్తుతం..
గడిచిన రెండు దశాబ్దాల్లో కొత్త కరెంటు లైన్లు వేసే ప్రయత్నం జరిగినా, ప్రజల అవసరాలకు తగినంత స్థాయిలో మాత్రం అక్కడ సౌకర్యాలు లేవు. దీంతో ఈ రోజుకు కూడా విద్యార్థులు సాసారాం రైల్వేస్టేషన్ కు వచ్చి చదువుకుంటున్నారు. అదీగాక, కోచింగ్ సెంటర్ స్థాయిలో చదువులు సాగుతుండటంతో ఇంట్లో కరెంటు ఉన్నోళ్లు కూడా స్టేషన్ కే వచ్చి కూర్చుంటున్నారు. విద్యార్థుల ఆసక్తికి ఏనాడూ అడ్డు చెప్పని స్థానిక రైల్వే అధికారులు.. పిల్లలకు ప్రత్యేక పాసులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. దీనిపై..
For two hours every morning and evening, both the platforms 1 and 2 of the railway station turn into a coaching class for young people who are aspirants for the Civil Services.
Excellent Initiative.??
Courtesy: Anuradha Prasad ILSS. pic.twitter.com/pLMkEn4AOF
— Awanish Sharan (@AwanishSharan) October 2, 2021
ఛత్తీస్ గఢ్ కేడర్ ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ఇటీవల తన ట్విటర్ లో సాసారాం రైల్వే జంక్షన్ లో ఫ్లాట్ ఫారాలపై సాగుతోన్న చదువుల ప్రహాసనం తాలుకూ ఫొటోలను పోస్ట్ చేయడంతో మరోసారి అది వైరల్ న్యూస్ గా మారింది. పదో తరగతి థర్డ్ క్లాస్ లో (కేవలం 44 శాతం మార్కులతో) పాసైన అవనీష్ శరణ్ చాలా మంది సివిల్స్ ఆస్పిరెంట్లకు, పేద విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారు. కాగా, ఐఏఎస్ అధికారి పోస్టుపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అయ్యాయి. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని కొందరంటే, అందుబాటులో ఉన్న సౌకర్యాలతో ఇంకొంచెం ముందుకు వెళుతోన్న ఆ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు మరికొందరు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Power problems, Railway station, Students