Russia Foreign Minister India Visit : ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య చేపట్టి నెల రోజులు దాటిపోయింది. ఉక్రెయిన్ లోని పలు నగరాలు రష్యా సేనల దాడిలో ధ్వంసమయ్యాయి. భారీగా ఆస్తిన్టం,ప్రాణనష్టం జరిగింది. ఇక,లక్షల మంది ఉక్రెయిన్ నుంచి పొరుగుదేశాలకు ముఖ్యంగా పోలాండ్ కు శరణార్థులుగా వెళ్తున్నారు. ఐక్యరాజ్య సమితి వద్దని చెబుతున్నా.. అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నా..పుతిన్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. తగ్గేదే లే అన్నట్లుగా.. ఉక్రెయిన్ ను ఉక్కబిరిబిక్కిరి చేస్తున్నారు. అయితే పశ్చిమ దేశాలు రష్యాపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించిన నేపత్యంలో తాజాగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత పర్యటనకు విచ్చేశారు. రెండు రోజుల చైనా పర్యటన ముగించుకొని గురువారం సాయంత్రం డిల్లీకి చేరుకున్న సెర్గీ లావ్రోవ్..శుక్రవారం భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్తో ఢిల్లీలో సమావేశమయ్యారు.
ఈ సందర్బంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. భారత్ ఎల్లప్పుడూ వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోడంపై మొగ్గు చూపుతుందని స్పష్టం చేశారు. వీరి భేటీ అనంతరం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశ విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. భారత విదేశాంగ విధానం స్వతంత్రమైనదని, రష్యా విధానం కూడా అదేనని అన్నారు. అందుకే ఇరు దేశాలు మంచి మిత్రులుగా ఉన్నాయని సెర్గీ లావ్రోవ్ అన్నారు. భారత్- రష్యా మధ్య చాలా మంచి సంబంధాలున్నాయని పేర్కొన్నారు. భారత్, రష్యాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాయని అన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసే చర్యలను వేగవంతం చేసినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీకి తమ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలు తెలిపారని గుర్తు చేశారు. గతంలో ఎదురైన ప్రతికూల పరిస్థితుల్లోనూ-ఉక్రెయిన్ వార్ విషయంలోనూ రెండు దేశాల మధ్య సంబంధం స్థిరంగా కొనసాగిందన్నారు. భారత్ తో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి రష్యా విదేశాంగ విధానంలో అధిక ప్రాధాన్యమిస్తామన్నారు.
ALSO READ Petrol Diesel Price Today: పండగ రోజు కూడా వదల్లేదు.. బాదుడే బాదుడు.. భారీగా పెరిగిన పెట్రోల్ రేట్లు
భారత్ ఏ వస్తువులు అడిగినా.. వాటిని సరఫరా చేసేందుకు తాము సదా సిద్ధంగానే వున్నామని రష్యా విదేశాంగ మత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించారు. అలాగే భారత్తో ఏ విషయంపైనైనా చర్చించడానికి కూడా తాము సిద్ధమని స్పష్టం చేశారు. భారత్ విషయంలో అమెరికా పెడుతోన్న ఒత్తిడి రష్యా- భారత్ సంబంధాలపై ఏమైనా ప్రభావం చూపెడుతుందా? అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు అలాంటిదేమీ ఉండదని, తమపై ఎలాంటి ఒత్తిళ్లూ పనిచేయవని రష్యా విదేశాంగ మంత్రి తేల్చి చెప్పారు. ఇతర దేశాల విషయాల్లో జోక్యం చేసుకోడానికి అమెరికా ఎక్కువ మక్కువ చూపుతుందని సెర్గీ లావ్రోవ్ చురకలంటించారు. ఉక్రెయిన్ పై తాము చేస్తున్నది యుద్ధం ఎంత మాత్రమూ కాదని, అదొక స్పెషల్ ఆపరేషన్ గా సెర్గీ లావ్రోవ్ అభివర్ణించారు. సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటూ తాము దాడులు చేశామన్నారు.
ఇక,శుక్రవారం సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీతో..సెర్గీ లావ్రోవ్ సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య సహా అనేక అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.