చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష ముగించుకుని ఇటీవల విడుదలైన జయలలిత నిచ్చెలి శశికళ సోమవారం నాడు చెన్నై నగరంలో అడుగుపెట్టనున్నారు. చిన్నమ్మ తమిళనాడులో అడుగుపెట్టబోతుండటం తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మరీ ముఖ్యంగా అధికార అన్నాడీఎంకేలో శశికళ ముసలం మొదలైంది. శశికళ చెన్నైకి వస్తుండటంతో ఆమె వర్గం తమిళనాడులో అల్లర్లకు, హింసాత్మక చర్యలకు పాల్పడాలని భావిస్తోందని అన్నాడీఎంకే నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, సొంత పార్టీ నేతలకు కూడా అన్నాడీఎంకే కీలక హెచ్చరిక చేసింది.
శశికళ చెన్నైకి వస్తున్న నేపథ్యంలో.. ఆమెను కలిసేందుకు అన్నాడీఎంకే నేతలు ఎవరు వెళ్లినా ఉపేక్షించేంది లేదని, పార్టీ నుంచి బహిష్కరిస్తామని అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేసింది. పళని స్వామి, పన్నీరు సెల్వం అధ్యక్షతన జరిగిన అన్నాడీఎంకే కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. పళనిస్వామి కేబినెట్లో, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కొందరు శశికళ అనుచరులున్నారు. తమిళనాడులో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో శశికళ ఎంట్రీతో పార్టీలో చీలికలు తప్పవని అధిష్టానం కలవరపడుతోంది. అందుకే.. శశికళ వెంట పార్టీ నేతలెవరూ వెళ్లకుండా అన్నాడీఎంకే అప్రమత్తమవుతోంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో, స్థానికంగా పీఎంకేతో కలిసి అన్నాడీఎంకే ఈ ఎన్నికల బరిలో నిలవనుంది. ఈ సందర్భంలో సీట్ల సర్దుబాటుపై కూడా ఆ పార్టీ సీరియస్గా కసరత్తు చేస్తోంది. అయితే.. శశికళ పొలిటికల్ రీఎంట్రీతో అన్నాడీఎంకేకు కొత్త తలనొప్పులు తప్పేలా లేవు. శశికళ తమిళనాడులోకి అడుగుపెట్టగానే పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఆమె వర్గం ఏర్పాట్లు చేస్తోంది. తిరువత్తియూరులో శశికళకు 35 అడుగుల భారీ కటౌట్ను ఆమె అనుచరులు ఇప్పటికే ఏర్పాటు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.