news18-telugu
Updated: November 12, 2018, 3:19 PM IST
మేక్ ఇన్ ఒడిషా కాన్క్లేవ్లో మాట్లాడుతున్న ఆర్ఐఎల్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ
ఒడిషాలో ఇప్పటికే రూ.6,000 కోట్ల పెట్టుబడులు పెట్టామని, మరో రూ.3,000 కోట్ల పెట్టుబడులు పెడతామని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఒడిషాలోని భువనేశ్వర్లో జరుగుతున్న 'మేక్ ఇన్ ఒడిషా' కాన్క్లేవ్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఒడిషా వార్షిక వృద్ధిరేటు 8 శాతం ఉందని, ఇది జాతీయ సగటుకన్నా ఎక్కువ అని కొనియాడారు. 'మేక్ ఇన్ ఒడిషా' కార్యక్రమంలో తాము కూడా భాగస్వాములం అవుతామని, రిలయెన్స్ ద్వారా ఇప్పటికే అనేక మందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. జియో ద్వారా గత రెండేళ్లలో 30 వేల మందికి ఉపాధి కల్పించామన్నారు.
ప్రస్తుతం ప్రపంచంలో ప్రతీది డిజిటలైజ్డ్ అవుతుందని, సంగీతం, సినిమాలు, కార్లు, ఆరోగ్యం, విద్య లాంటివన్నీ డిజిటల్వైపు పయనిస్తున్నాయని అన్నారు ముఖేష్ అంబానీ. ఈ డిజిటల్ విప్లవంలో రిలయెన్స్తో పాటు జియో భాగస్వామ్యం ఉందని, ఒడిషాలోని నగరాలు, పట్టణాలతో పాటు 43,000 గ్రామాలను జియో కనెక్ట్ చేసిందని చెప్పారు. లక్షలాది మందికి స్మార్ట్ఫోన్స్ వచ్చాయని, కేవలం వంద రూపాయలతో స్మార్ట్ సేవలు పొందుతున్నారన్నారు. దేశంలోనే డేటా వినియోగం ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఒడిషా టాప్లో ఉందన్నారు.
జియో గిగాఫైబర్తో ఇంటింటికీ డేటా సేవల్ని తీసుకెళ్తామని, ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్లో ప్రస్తుతం 135వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని మూడేళ్లలో టాప్-3 లోకి తీసుకొస్తామని చెప్పారు ముఖేష్ అంబానీ. ఆఫ్లైన్ షాపింగ్పై దృష్టిపెట్టామని, దీని ద్వారా ఒడిషాలోని యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఒడిషాలో రిలయెన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అథ్లెటిక్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్లో పతకాలు సాధించేందుకు తోడ్పడతామని చెప్పారు.
మేక్ ఇన్ ఒడిషా కాన్క్లేవ్ 2016లో మొదటిసారి నిర్వహించారు. ఇప్పుడు రెండో ఎడిషన్ భువనేశ్వర్లో ఘనంగా ప్రారంభమైంది. నవంబర్ 11 నుంచి 15 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఒడిషాకు పెట్టుబడులను ఆహ్వానించేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తమ రాష్ట్రంలో వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వ్యాపారవేత్తలకు తెలిపారు.
Published by:
Santhosh Kumar S
First published:
November 12, 2018, 12:55 PM IST