గతంలో చాలా పేమెంట్ యాప్స్ (Payments Apps) తమ ప్లాట్ఫామ్స్ ద్వారా మొబైల్ రీఛార్జీలు, మిగతా యుటిలిటీ బిల్లులు కట్టుకుంటే క్యాష్బ్యాక్ ఆఫర్ ఇస్తామని యూజర్లను బాగా ప్రోత్సహించాయి. ఈ సంస్థలు ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండానే సేవలు అందించాయి. భారతదేశంలో అత్యంత పాపులర్ అయిన ఆన్లైన్ పేమెంట్ యాప్స్ పేటీఎం (Paytm), ఫోన్పే (PhonePe) కూడా ఫ్రీగా సేవలను ఆఫర్ చేశాయి. కానీ ఇప్పుడా రోజులు పోయాయి. తమ యాప్ సేవలను ఉపయోగిస్తున్న యూజర్లపై పేటీఎం, ఫోన్పే ఎక్స్ట్రా ఫీజులు వసూలు చేస్తూ షాకిస్తున్నాయి. ఇప్పుడు, ఈ యాప్స్ తమ ప్లాట్ఫామ్స్ ద్వారా మొబైల్ రీఛార్జ్, విద్యుత్ బిల్లులు చెల్లించే తమ కస్టమర్ల నుంచి ప్లాట్ఫామ్ ఫీజు (Platform Fee) కూడా వసూలు చేయడం ప్రారంభించాయి.
ప్లాట్ఫామ్ ఫీజు అంటే ఏంటి?
పేమెంట్ మోడ్తో సంబంధం లేకుండా, రీఛార్జ్లు/బిల్ చెల్లింపుల కోసం తమ యాప్ను ఉపయోగించేవారికి ప్లాట్ఫామ్ ఫీజును నామమాత్రపు రుసుముగా ప్రవేశపెట్టామని తాజాగా PhonePe తెలిపింది. ఈ ఫీజు GST తో కలిపి ఉంటుందని పేర్కొంది. ఒకవేళ మొబైల్ రీఛార్జ్ ఫెయిలైతే, రీఛార్జ్ కోసం చెల్లించిన మొత్తంతో సహా జీఎస్టీ, ప్లాట్ఫామ్ రుసుము కూడా రీఫండ్ చేస్తామని వెల్లడించింది.
ఇంతకీ ప్లాట్ఫామ్ ఫీజుగా ఎంత చెల్లించాలి?
Paytm యాప్ని ఉపయోగించి చేసే ప్రతి మొబైల్ రీఛార్జ్కు యూజర్లు రూ.1 ప్లాట్ఫామ్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. Paytm నుంచి రూ.100 కంటే ఎక్కువ విలువైన మొబైల్ రీఛార్జ్లకు మాత్రమే ఈ ఫీజు వర్తిస్తుంది. అలానే, ఫోన్పే (PhonePe) ద్వారా రూ.50 కంటే ఎక్కువ ధర గల రీఛార్జ్ చేసుకుంటే ప్లాట్ఫామ్ ఫీజుగా రూ.1 వసూలు చేస్తుంది. అదే, రూ. 100 కంటే ఎక్కువ రీఛార్జ్ చేస్తే రూ.2 ఛార్జీ కట్టక తప్పదు. ఇప్పటికిప్పుడు ప్రతి ఒక్కరికీ ఈ ప్లాట్ఫామ్ రుసుము వర్తించదు. ప్రస్తుతానికి కేవలం సెలెక్టెడ్ యూజర్లకు మాత్రమే ఛార్జ్ వర్తిస్తుంది. భవిష్యత్తులో ఈ ఛార్జ్ అందరికీ విధిస్తాయి.
ఈ తరహా ఛార్జీలపై నెటిజన్లు ఫైర్
పేటీఎం (Paytm) యాప్ ద్వారా చెల్లించే విద్యుత్ బిల్లులకు ప్రతి ట్రాన్సాక్షన్కు 5 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోందని యూజర్లు నెట్టింట వాపోతున్నారు. ప్లాట్ఫామ్ రుసుముగా రూ.1 అని చెబుతున్నా ఇతర వినియోగదారులకు ఈ ఛార్జీలు మారుతూ ఉంటాయి. అయితే, గూగుల్ పే వంటి ఇతర చెల్లింపు యాప్లు ఇలాంటి రుసుములను విధించడం లేదు. అలాగే, ఆయా టెలికాం కంపెనీల సొంత సైట్ లేదా యాప్ని ఉపయోగిస్తే.. ప్లాట్ఫామ్ రుసుము కట్టాల్సిన అవసరం రావడం లేదు. దీంతో యూజర్లు ఇప్పుడు పేమెంట్స్ చేసుకోవడానికి వీటి వైపే మళ్లుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.