పరిమళ్ నత్వానీ... పరిచయం అక్కర్లేని ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభకు గతేడాది ఎన్నికయ్యారు. అంతకుముందు రెండుసార్లు ఝార్ఖండ్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఇవన్నీ ఆయన గురించి అందరికీ తెలిసినవే. కానీ ఆయన గిర్ అడవుల ప్రేమికుడు అన్న విషయం కొందరికి మాత్రమే తెలుసు. గిర్ అడవుల్లోని సింహాలంటే ఆయనకు ప్రాణం. ప్రకృతిలోని ఎన్నో అద్భుతాలు ఎందరినో ఆకర్షిస్తుంటాయి. కానీ కొందరు మాత్రమే ప్రకృతిని, ప్రకృతిలోని జంతువుల్ని తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ ఉంటారు. అలా చూసుకోవడం మాత్రమే కాదు... వాటిని కాపాడేందుకు కష్టపడుతుంటారు. పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యులు పరిమళ్ నత్వానీ కూడా అలాంటి దారిలో నడుస్తున్నారు.
గిర్ అడవుల గుండా వెళ్లే రైళ్ల కారణంగా ఇక్కడి సింహాలు, ఇతర జంతువులు రైలు పట్టాలపై చనిపోతూ ఉండేవి. గాయపడుతూ ఉండేవి. ఇలాంటి ఘటనలు పరిమళ్ నత్వానీని బాగా కలచివేశాయి. ఏదైనా చేయాలనుకున్నారు. ఈ విషయాన్ని గుజరాత్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు తీసుకెళ్లారు. మూగజంతువలను కాపాడాలని కోరారు. గిర్ అడవుల్లోని సింహాలను రక్షించేందుకు అనేక చర్యలు తీసకున్నారు. అందుకే గిర్ ప్రాంతానికి పరిమళ్ నత్వానీ వస్తే ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతూ ఉంటారు. గిర్ అడవులు, ఇక్కడి సింహాలకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ఆయన కృషి చేస్తారని పర్యావరణ వేత్త, సామాజిక కార్యకర్త రోహిత్ వ్యాస్ చెబుతున్నారు.
గిర్ అడవులకు వచ్చినప్పుడల్లా ఇక్కడి సింహాలను చూసి అద్భుతం అని ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు... ఆ సింహాల ప్రాణాలు కాపాడేందుకు అనేక చర్యల్ని తీసుకుంటున్నారు పరిమళ్ నత్వానీ. సింహాలు బావుల్లో పడి చనిపోయిన ఘటనలో అనేకం ఉన్నాయి. ఈ ఘటనలు ఆయను బాధించాయి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకున్నారు. సింహాలు బావుల్లో పడి మరణించకుండా అడ్డుకోవడం నుంచి సాసాన్ గిర్లో సింహాలకు అత్యాధునిక ఆస్పత్రి ఏర్పాటు చేసేంత వరకు సింహాలను కాపాడే ప్రతీ విషయంలో పరిమళ్ నత్వానీ ఎల్లప్పుడూ ముందే ఉంటున్నారు.
మృగరాజు అయిన సింహాలు తన సొంత పిల్లలు అని పరిమళ్ నత్వానీ చెబుతున్నారు. మరో 3,000 బావుల చుట్టూ గోడలు కట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన 'గిర్ లయన్-ప్రైడ్ ఆఫ్ గుజరాత్' పుస్తకం కూడా రాశారు. నవాబుల సమయంలో కేవలం 20 సింహాలు మాత్రమే గిర్ అడవుల్లో ఉండేవి. ఇప్పుడు 700 సింహాలు ఉన్నాయి. గిర్ అడవులు ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారాయి. గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో గిర్ అడవులు, అక్కడి సింహాలకు సంబంధించిన గ్యాలరీ ఏర్పాటు చేశారు పరిమళ్ నత్వానీ. సింహాలకు సంబంధించి మరిన్ని ప్రాజెక్టులు చేపట్టబోతున్నామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Lions, Parimal Nathwani