రాఫెల్ డీల్ వివరాలను మన పార్లమెంట్లో కాకుండా ఫ్రెంచ్ పార్లమెంట్లో ఏమైనా పెట్టారా ? అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించినట్టు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. రూ. 1600 కోట్లకు రాఫెల్ డీల్ ఎలా కుదిరిందని ప్రశ్నించారు. రాఫెల్ డీల్పై జేపీసీ(జాయింట్ పార్లమెంటరీ కమిటీ) వేయాలన్నదే తమ డిమాండ్ అని రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేశారు. ఈ డీల్ వివరాలు ఇప్పటికే కాగ్ ద్వారా పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి అందాయని సుప్రీంకోర్టు పేర్కొందని చెప్పిన రాహుల్... అసలు అలాంటి వివరాలేవీ కాగ్కు చేరలేదని అన్నారు.
తాను చెబుతున్న విషయానికి పీఏసీ( పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) చైర్మన్గా ఉన్న మల్లికార్జున ఖర్గే వాదనే సాక్ష్యమని అన్నారు. పీఏసీ చైర్మన్ ఖర్గేకు తెలియకుండా ఈ నివేదిక ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఖర్గేకు తెలియకుండా వేరే పీఏసీ ఉందా ? అని వ్యాఖ్యానించారు. మేం అడిగిన ప్రశ్నలకు కేంద్రం దగ్గర సమాధానం లేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తన స్నేహితుడికి మోదీ దేశ ధనాన్ని దోచీ పెట్టారని ఆరోపించారు. రాఫెల్ స్కామ్పై తన సవాల్కు కట్టుబడి ఉన్నానన్న రాహుల్ గాంధీ... దేశానికి చౌకీదార్ అని చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్రమోదీ పెద్ద దొంగ అని మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Congress, Mallikarjun Kharge, Pm modi, Rafale Deal, Rahul Gandhi