ఏడాది నుంచి తన నియోజకవర్గానికి తాను ఏమీ చేయలేకపోయానని వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎమ్మెల్యే పదవి అలంకారం కాదని... గతంలో అనేకసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశానని ఆయన తెలిపారు. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలకు మంత్రిగా పని చేశానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జిల్లా అధికారులు వెంకటగిరి నియోజకవర్గాన్ని మర్చిపోయారేమో అని ఆనం అన్నారు. తాను ఎంతో ఆవేదనతో మాట్లాడాల్సి వస్తుందని అన్నారు. ప్రజల కోసం ఎవరినైనా నిలదీస్తానని ఆయన అన్నారు.
సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా ప్రజలకు అందేవి తప్ప... మిగతా ఏ కార్యక్రమాలు తాను చేయలేకపోతున్నానని ఆనం తెలిపారు. సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు.ఇంత అధ్వాన్నపు అధికార యంత్రాంగాన్ని చూడలేదని అన్నారు. జలవనరులశాఖలో అధికారులే నీళ్లు అమ్ముకున్నారంటూ విమర్శలు చేశారు. మంత్రులకు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం డీపీఆర్లు ఇస్తే... అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
గతంలోనూ ఆనం తన వ్యాఖ్యలతో కలకలం రేపారు. నెల్లూరులో మాఫియా రాజ్యమేలుతోందంటూ కొన్ని నెలల క్రితం ఆయన చేసిన కామెంట్స్ వైసీపీలో దుమారాన్ని రేపాయి. నెల్లూరులో మాఫియా రాజ్యమేలుతోందని తన పార్టీకే చెందిన మంత్రి అనిల్కుమార్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలపై ఆనం రామనారాయణరెడ్డి పరోక్షంగా ఆరోపణలు చేశారు. అయితే ఆనం వ్యాఖ్యలపై స్పందించిన సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనంకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని, అవసరమైతే సస్పెండ్ చేయాలని పార్టీ నేతలను జగన్ ఆదేశించారని వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత సీఎం జగన్తో ఆనం సమావేశం కావడంతో ఆ వివాదం ముగిసిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anam Ramanarayana Reddy, Andhra Pradesh, Nellore Dist, Ysrcp