వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో హైకోర్టు సీరియస్ అయ్యింది. కేసు దర్యాప్తునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందించిన సీల్డ్ కవర్ నివేదికపై ఫైర్ అయ్యింది. సీల్డ్ కవర్ నివేదిక సరిగా లేదని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోసారి నివేదిక పంపించాలని కేంద్రప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ చేసింది. కేసు విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.
కేంద్ర ప్రభుత్వం పంపిన సీల్డ్ కవర్ నివేదిక విషయంలో హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిందని జగన్ తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. శుక్రవారంలోగా కేసును ఎన్ఐఏకు మీరు బదిలీ చేస్తారా? లేక మమ్మల్నే బదిలీ చేయమంటారా అని కూడా కేంద్రాన్ని హైకోర్టు ప్రశ్నించిందని చెప్పుకొచ్చారు. విశాఖ ఎయిర్పోర్టులో జగన్పై దాడి జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ చేయించే అంశంపై పరిశీలన జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదిక పంపింది.
హత్యాయత్నం జరిగిన ప్రాంతం ఎన్ఐఏ చట్టంలో నిర్ధేశించిన నేరాల పరిధిలోకి వస్తుందో రాదో పరిశీలన చేస్తామని కేంద్రం పేర్కొంది. ఆ తరువాత దర్యాప్తుపై నిర్ణయం తీసుకుంటామని, అందుకు కొంత సమయం పడుతుందని కూడా కేంద్రం దర్యాప్తు సంస్థ వివరించింది.అయితే ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఎన్ఐఏ దర్యాప్తుపై ఏ నిర్ణయం తీసుకున్నా బహిర్గతం చేయకుండా సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే శుక్రవారం కేంద్ర ప్రభుత్వం సీల్డ్ కవర్లో పంపిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మళ్లీ పూర్తి స్థాయి నివేదిక పంపాలని ఆదేశించింది.
ఈ ఏడాది అక్టోబరులో జగన్పై విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగింది. విమానాశ్రయంలోనే పనిచేస్తున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి జగన్పై కోడికత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన జగన్.. హైదరాబాద్లో చికిత్స పొందారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Politics, High Court, Ys jagan, Ysrcp