తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం ముదురుతోంది. తెలంగాణ మంత్రులు-ఆంధ్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు రెండు రాష్ట్రాల అధికారులు ఫిర్యాదులపై ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఇటు ఇద్దరు సీఎంలు ప్రధానికి లేఖలపై లేఖలు రాస్తున్నారు. అయినా వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అయిన ఆయన.. తెలంగాణ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చట్టం ప్రకారం కృష్ణా జలాలను వాడుకునేలా చర్యలు తీసుకోవాలని జలశక్తి మంత్రిని కోరాము అన్నారు. విశాఖ గ్రామీణ ప్రాంతాలకు మంచినీటి సరఫరా కోసం ఏలేశ్వరం ప్రాజెక్టు ఖర్చులో సగభాగం జలజీవన్ పథకం కింద భరించాలని కోరినట్లు చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి అనుమతి ఇవ్వాలని.. అలాగే కేఆర్ఎంబీ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. కేఆర్ఎంబీ పరిధిలోని ప్రాజెక్టులకు రక్షణ కల్పించాలని కోరినట్లు విజయసాయి చెప్పారు.
తెలంగాణ ప్రాజెక్ట్లపై ఓ వైపు ట్రిబ్యునల్ కు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదులు చేస్తోంది. కేంద్రానికి లేఖల మీద లేఖాస్త్రాలు రాస్తోంది. అయినా తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తగ్గకపోవడంతో నేరుగా వెళ్లి కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు ఏపీకి చెందిన ప్రతినిధుల బృందం. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలు కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను కలిశారు. తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని తక్షణం ఆపించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: ఎంపీ రఘురామపై అనర్హత వేటు లేనట్టేనా..? లోక్ సభ స్పీకర్ తీరుపై వైసీపీ అసహనం
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిని వెంటనే నోటిఫై చేయాలని, ప్రాజెక్ట్ల దగ్గర సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పించాలని మంత్రిని కోరారు. తెలంగాణలో కొత్త ప్రాజెక్ట్లపై అభ్యంతరం చెబుతూ లేఖను కూడా అందించారు విజయసాయిరెడ్డి. 8 ప్రాజెక్ట్ల ద్వారా 183 TMCలను తరలించేలా పనులు చేపడుతోందని, మరో 10 ప్రాజెక్ట్లను విభజన చట్టానికి విరుద్ధంగా కడుతోందని అభ్యంతరం చెబుతోంది ఏపీ సర్కార్. పాలమూరు రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు, తుమ్మిళ్ల, మిషన్ భగీరథ, కల్వకుర్తి, నెట్టెంపాడు, SLBC విస్తరణ ద్వారా 183 టీఎంసీలను తరలిస్తోందని కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఇవి కాక మరో ఆరు ప్రాజెక్ట్లపై సర్వేకు అనుమతులు ఇచ్చారని కేంద్రానికి ఏపీ ఫిర్యాదు చేస్తోంది. శ్రీశైలం పైభాగాన తుంగభద్ర, కృష్ణ కలిసే చోట 40 టీఎంసీలను వినియోగించుకునేలా జోగులాబం బ్యారేజ్ నిర్మించాలని ప్లాన్ చేస్తోందని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకువచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. రోజూ ఒక టీఎంసీని తరలించేలా బీమా కెనాల్ను విస్తరించాలని చూస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వెంటనే అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని విజయసాయిరెడ్డి కోరారు.
ఇదీ చదవండి: గంటాను టీడీపీ పెద్దలు పక్కన పెట్టారా..? భీమిలి, నార్త్ నియోజవర్గాలపై ఆ ఇద్దరూ ఫోకస్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Vijayasai reddy, Water Crisis, Water dispute