వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా చెలరేగిపోయారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను, తన స్వార్థం కోసం చంద్రబాబు వాడుకుంటున్నారనీ, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పథకాల అమలును అడ్డుకునేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పై పొగడ్తల వర్షం కురిపించారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా థీరుడిలా జగన్ పోరాడుతున్నారనీ, అభివృద్ధి పనులను చేపట్టి ప్రజలకు సేవ చేస్తున్నారన్నారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రూపంలో మరోసారి అభివృద్ధి పథకాలను అడ్డుకోవాలని చంద్రబాబు యత్నిస్తున్నారనీ, ప్రజాక్షేత్రంలో వారికి తగిన శాస్తి ఇప్పటికే జరిగిందన్నారు.
‘నిమ్మగడ్డతో ఎన్నికల షెడ్యూల్ ఇప్పించి ఇళ్ల పట్టాల పంపిణీ, అమ్మఒడి సాయాన్ని ఆపాలనుకోవడం... ఆరోజుల్లో కళ్లెర్రజేసి సముద్రాన్ని కంట్రోల్ చేశా, తుఫానును అడ్డుకున్నానని కోతలు కోయడం లాంటివే బాబు. ఏదో చేయాలనుకుంటావు కానీ ఏమీ జరగదు. భ్రాంతి నుంచి బయటపడు..‘ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అంతకుముందు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ‘సీఎస్ వద్దన్నా - ఉద్యోగ సంఘాలు నో అన్నా. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ప్రభుత్వం సిద్దం అయినా- ఎవరి ప్రయోజనాలకోసం ఈ పంచాయతీ నిమ్మగడ్డా?, ప్రభుత్వంతో సంప్రదింపులు జరపమని సుప్రీంకోర్టు చెబితే... నువ్వు చేసే నిర్వాకం ఇదా? ఎన్నికలను ఏకపక్షంగా ప్రకటించి నీ చంద్రభక్తి చాటుకున్నావె!‘ అంటూ ట్వీట్ చేసి రాజకీయ చర్చకు తెరలేపారు.
నిమ్మగడ్డతో ఎన్నికల షెడ్యూల్ ఇప్పించి ఇళ్ల పట్టాల పంపిణీ, అమ్మఒడి సాయాన్ని ఆపాలనుకోవడం... ఆరోజుల్లో కళ్లెర్రజేసి సముద్రాన్ని కంట్రోల్ చేశా, తుఫానును అడ్డుకున్నానని కోతలు కోయడం లాంటివే బాబు. ఏదో చేయాలనుకుంటావు కానీ ఏమీ జరగదు. భ్రాంతి నుంచి బయటపడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 11, 2021
కాగా, ఏపీలో పంచాయతీ ఎన్నికలు రాజకీయంగా తీవ్రమైన రచ్చను క్రియేట్ చేస్తున్నాయి. చంద్రబాబు చెప్పినట్టు నడుస్తున్నారంటూ నిమ్మగడ్డపై వైసీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి రీత్యా ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ వద్దని ఏపీ సర్కారు వాదిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులంతా టీకా విధుల్లో ఉంటారనీ, ఈ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే కరోనా కేసులు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలు ఎక్కువ కాదని చెబుతోంది. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపుతున్నారు. సరైన కాలంలో ఎన్నికలు నిర్వహించకపోతే ఆర్థిక సంఘం నిధులు రావని ఆయన చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chandrababu naidu, Nimmagadda Ramesh Kumar, Vijayasai reddy, Ycp