టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు ఎంపికైన మాజీ కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్... కాలక్రమంలో ఆ పార్టీకి దూరమైన సంగతి తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంగా డీఎస్పై చర్యలు తీసుకోవాలంటూ అప్పట్లో టీఆర్ఎస్ నేత కవిత ఆధ్వర్యంలోని నిజామాబాద్ నేతలు కేసీఆర్కు ఫిర్యాదు కూడా చేశారు. అయితే తాజాగా డీఎస్ తనయుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా కవితపై విజయం సాధించడంతో... డీఎస్ విషయంలో టీఆర్ఎస్ ఎలాంటి వైఖరి తీసుకుంటుందో అని పార్టీ వర్గాలు ఎదురుచూశాయి. అయితే రోజులు గడుస్తున్నా... ఈ విషయంలో టీఆర్ఎస్ మాత్రం చూసీచూడనట్టుగానే వ్యవహరిస్తోంది.
ఇటీవల ఎంపీగా గెలిచిన కుమారుడు అరవింద్ సన్మాన సభలో పాల్గొన్న డీఎస్... రైతులు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అంటూ పరోక్షంగా కవిత ఓటమి గురించి ప్రస్తావించడం టీఆర్ఎస్ శ్రేణులకు అస్సలు మింగుడుపడటం లేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డీఎస్పై పార్టీ పరమైన చర్యలు తప్పితే... రాజ్యసభలో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఫిర్యాదు చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండకపోవచ్చని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
రాజ్యసభలో మెజార్టీ కోసం తమదైన శైలిలో వ్యూహరచన చేస్తున్న బీజేపీ...తమ సొంత పార్టీ ఎంపీ తండ్రి అయిన డీఎస్పై చర్యలు తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకే లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు గడుస్తున్నా... డీఎస్పై చర్యలు తీసుకునే అంశంపై టీఆర్ఎస్ అంత సీరియస్గా ఫోకస్ చేయడం లేదనే చర్చ జిల్లా రాజకీయవర్గాల్లో జరుగుతోంది. మరోవైపు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న డీఎస్... దీనిపై ఎక్కడా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం లేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి డీఎస్ రాజ్యసభ సభ్యత్వంపై చర్య తీసుకునే విషయంలో కేసీఆర్ మనసులో ఏముందనే విషయం ఆ పార్టీ వర్గాలకు కూడా అంతుచిక్కడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, CM KCR, Congress, D Srinivas, Dharmapuri aravind, Trs