ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే చర్చ రెండు వారాల నుంచి జోరుగా సాగుతోంది. ఎవరికి వారు తమ అభిమాన పార్టీ గెలుస్తుందనే ధీమాతో ఉన్నారు. పార్టీల గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా... కొన్ని సీట్లలో రాజకీయ పార్టీల విజయానికి సంబంధించి ఈ సారి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అలాంటి సీట్లలో చిత్తూరు లోక్ సభ స్థానం కూడా ఉంది. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం అసెంబ్లీ సీటు ఉండే చిత్తూరు నియోజకర్గం రెండు దశాబ్దాలకు పైగా టీడీపీ ఖాతాలోనే పడుతూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పరాజయం చవిచూసినప్పటికీ... చిత్తూరు ఎంపీ సీటును మాత్రం ఆ పార్టీ గెలుచుకుంటూ వస్తోంది.
అయితే చిత్తూరు ఎంపీ సీటు టీడీపీ కైవసం కావడానికి మరో ప్రధాన కారణం కుప్పంలో చంద్రబాబు సాధిస్తున్న మెజార్టీ అనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. 2014 ఎన్నికల్లో చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ 44 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. ఇందుకు ప్రధాన కారణం కుప్పంలోచంద్రబాబుకు వచ్చిన మెజార్టీ అనే టాక్ ఉంది. గత ఎన్నికల్లో చిత్తూరు లోక్ సభ స్థానం పరిధిలోని మెజార్టీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకున్నా... కుప్పం కారణంగానే చిత్తూరు లోక్ సభను ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు 47 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీ సాధించడం వల్లే చిత్తూరు లోక్ సభ స్థానం నుంచి టీడీపీ ఎంపీ శివప్రసాద్ గెలుపొందారని రాజకీయవర్గాలు చెబుతుంటాయి.
ఈ కారణంగానే చిత్తూరు లోక్ సభ సీటును దక్కించుకోవాలంటే కుప్పంలో చంద్రబాబు మెజార్టీ తగ్గించాలనే నిర్ణయానికి వచ్చిన వైసీపీ... ఆ దిశగా వ్యూహరచన చేసిందనే ప్రచారం జరిగింది. దీంతో మరోసారి చంద్రబాబు సాధించబోయే మెజార్టీనే చిత్తూరు లోక్ సభలో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సి ఉంటుందని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి... చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి టీడీపీ కంచుకోటగా ఉంటూ వస్తున్న చిత్తూరు లోక్ సభ స్థానాన్ని ఈ సారి వైసీపీ సొంతం చేసుకుంటుందా లేదా అన్నది తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu naidu, Chittoor S01p25, Tdp, Ys jagan mohan reddy, Ysrcp