ఏపీలో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకోనుంది. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పీకర్ తమ్మినేని సీతారాంను కలవనున్నారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ కు గంటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేయనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ రాజీనామా చేసిన గంటా మాత్రం.. రాజకీయ ఒత్తిడితోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవచ్చు అని భావిస్తున్నారు. అందుకే తన రాజీనామా ఆమోదించాలని స్పీకర్ ను కలిసి కోరుతాను అంటున్నారు గంటా..
గంటా శ్రీనివాసరావు మనసులో మాత్రం వేరే ఆలోచన ఉందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇటీవల పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల తరువాత ఆయన టీడీపీ దిగిపోవడమే బెటరి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇంకా టీడీపీలో ఉంటే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆయన అనుచరులకు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే గంటా పార్టీ మారడడంపై గతంలోనే పలు ఊహాగానాలు వచ్చాయి. స్వయంగా ఎంపీ విజయసాయిరెడ్డే దీనిపై వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం ముందు గంటా కొన్ని ప్రతిపాదనలు పెట్టారని.. అధినేత జగన్ వాటికి ఆమోదం తెలిపితే త్వరలోనే ఆయన వైసీపీలో చేరుతారంటూ ప్రకటించారు.
విజయసాయి వ్యాఖ్యలకు గంటా శ్రీనివాసరావు అప్పుడే కౌంటర్ ఇచ్చారు. ఏం ప్రతిపాధనలు పెట్టానో చెప్పాలి అంటూ ప్రశ్నించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే విజయసాయిరెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. దానికి విజయసాయిరెడ్డి కూడా వెంటనే కౌంటర్ ఇచ్చారు. గంటా పార్టీలో చేరినంత మాత్రన పరిస్థితి ఏం మారిపోదన్నారు. ఇలా విజయసాయిరెడ్డి-గంటాల మధ్య గ్యాప్ పెరిగింది. దీంతో గంటా శ్రీనివాసారావు వైసీపీలో చేరుతారనే ప్రచారానికి పుల్ స్టాప్ పడింది.
గంటా శ్రీనివాసరావు మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు చూసిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని అప్పటికి సైలెంట్ అయ్యారని ప్రచారం జరిగింది. ఒకవేళ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే.. వైసీపీపై స్టీల్ ప్లాంట్ ఉద్యమ ప్రభావంతో పాటు.. స్థానికంగా వ్యతిరేకత ఉంటుందని అలాంటప్పుడు ఆ పార్టీలో చేరి కోరి కష్టాలు తెచ్చుకోవడం ఎందుకని వెనుకడుగు వేసినట్టు తెలుస్తోంది. కానీ అన్ని ప్రతికూలతల మధ్య.. వైసీపీ విశాఖలో ఘన విజయం సాధించింది. టీడీపీకి ఓటు వేసేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. అందుకే ఇంకా టీడీపీలో ఉండడం కంటే వైసీపీ గూటికి చేరడమే బెటరని ఆయన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే గతంలో విజయసాయిరెడ్డితో మాటల యుద్ధం నడిచిన నేపథ్యంలో వేరే మార్గంలో ప్రయత్నాలు చేయాలని ఆయన భావిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు రాజీనామా పేరుతో స్పీకర్ ద్వారా.. తన ప్రతిపాధనలను అధిష్టానానికి తెలియచేయాలనే లక్ష్యంతోనే ఆయన స్పీకర్ ను కలుస్తున్నారని.. త్వరగా రాజీనామాను ఆమోదించుకుని.. సైకిల్ దిగిపోవడం మంచిదని గంటా నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
ఆయన మాత్రం బయటకు పార్టీ మారలేదని చెబుతున్నా.. సైలెంట్ గా స్కెచ్ వేస్తున్నారని తెలుగు తమ్ముళ్లే ప్రచారం చేస్తున్నారు. మొన్నటి కార్పొరేషన్ లో ఓటమికి గంటా శ్రీనివాసరావే కారణమంటూ అధిష్టానానికి నివేదికలు కూడా ఇచ్చారు. పరోక్షంగా ఆయన అధికార పార్టీకి సహకరించారని ఆరోపణలు చేశారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. గంటా రాజీనామా ఆమోదించేందుకే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఏపీలో మరో ఎన్నికల గంట మోగడం ఖాయం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Speaker Tammineni Seetharam, Ganta srinivasa rao, Visakha, Visakhapatnam