కొంతకాలంగా టీడీపీని తికమకపెడుతున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని... మరోసారి ఫేస్బుక్లో కొత్త పోస్టు ద్వారా సంచలనం సృష్టించారు. తాను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తినని, నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం, ప్రజాసేవే తన నైజమని ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం మాత్రమే తెలిసినవాడినని పేర్కొన్నారు. రాష్ట్రం కోసం లోక్సభలో ప్రధాని మోదీని నిలదీసినవాడినన్నారు. భయం తన రక్తంలోనే లేదని.. రేపటి గురించి ఆలోచన అంతకంటే లేదన్నారు. ఎవరెన్ని విపరీతార్థాలు తీసినా లెక్కచేయనని కేశినేని నాని తన పోస్టులో పేర్కొన్నారు.
లోక్సభలో తనకు సరైన పదవి ఇవ్వలేదని టీడీపీ తీరుపై అసంతృప్తితో ఉన్న కేశినేని నానిని స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు పిలిచి బుజ్జగించారు. అయినప్పటికీ కేశినేని తీరులో మాత్రం మార్పు రాలేదు. ఆయన టీడీపీని వీడి బీజేపీలో చేరతారని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే తాను టీడీపీని వీడబోనని చెబుతున్న కేశినేని నాని... ఆ పార్టీని ఇబ్బంది పెట్టేలా ఫేస్ బుక్లో పోస్టులు పెడుతున్నారు. కొడాలి నానికి మంత్రి పదవి రావడానికి మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ కారణమంటూ కేశినేని నాని చేసిన పోస్టు సైతం ఆ పార్టీలో సరికొత్త చర్చకు దారితీసింది. కేశినేని నాని ఫేస్ బుక్ ద్వారా టీడీపీని ఇబ్బందిపెట్టేలా పరోక్షంగా పోస్టులు పెడుతుండటంతో... ఆయనపై పార్టీ ఏ రకమైన వైఖరి తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Chandrababu Naidu, Kesineni Nani, TDP