తాను బీజేపీలో చేరుతున్నానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ అన్నారు. నిజంగానే చేరాల్సిన సమయం వస్తే ఎవరు ఆపినా ఆగదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ జాతీయాధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షాను పార్లమెంట్లో మాత్రమే కలిశానని వివరించారు. సమస్యలపై ఎవరు ఎవరినైనా కలవొచ్చని డీఎస్ వ్యాఖ్యానించారు. తనపై నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలు కేసీఆర్కు ఫిర్యాదు చేసిన ఏడాదిన్నర అయ్యిందని డీఎస్ అన్నారు. దీనిపై పార్టీ నాయకత్వం నుంచి ఎలాంటి రిప్లై రాలేదని... భవిష్యత్తులో వస్తుందని కూడా అనుకోవడం లేదని డీఎస్ అన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక అంశంపై డీఎస్ తనదైన శైలిలో స్పందించారు. హుజూర్ నగర్లో డిఫరెంట్ రాజకీయం నడుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ సమయంలో ప్రజలు ఎలా తీర్పు ఇస్తారో చూడాల్సి ఉందని డీఎస్ వ్యాఖ్యానించారు.
బీజేపీలో ఉన్న తన కుమారుడు ధర్మపురి అరవింద్కు రాజకీయంగా సహకరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో... నాటి నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత సహా జిల్లాకు చెందిన పార్టీ నేతలు డీఎస్పై కేసీఆర్కు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి డీఎస్ టీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలను దూరంగా ఉంటూ వచ్చారు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేయాలని... తాను ఎంపీ పదవికి రాజీనామా చేయబోనని ఆయన గతంలోనే స్పష్టం చేశారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో ఆయన తనయుడు అరవింద్ బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా గెలుపొందడంతో...డీఎస్ కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఆయన అమిత్ షాను కలవడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. ఈ నేపథ్యంలో తాను బీజేపీలో చేరడం లేదని డీఎస్ వివరణ ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Congress, D Srinivas, Dharmapuri Arvind, Nizamabad, Trs