ఏపీలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికపై ప్రధాన రాజకీయ పార్టీలు సీరియస్గా దృష్టి పెట్టాయి. తనకు వ్యక్తిగత ఫిజియోథెరపిస్టుగా వ్యవహరించిన గురుమూర్తిని తిరుపతి ఉప ఎన్నికల బరిలో నిలపాలని వైసీపీ దాదాపుగా నిర్ణయించింది. తిరుపతి దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుమారుడికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న టీడీపీ కూడా వైసీపీకి ధీటుగా వ్యూహరచన చేస్తోంది. తిరుపతి లోక్ సభ స్థానాన్ని కొన్నేళ్ల నుంచి టీడీపీ దక్కించుకోలేకపోతోంది. అందుకే ఈసారి ఇక్కడ పట్టు పెంచుకోవాలని యోచిస్తోంది.
తిరుపతి లోక్సభకు వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ఉప ఎన్నిక జరగొచ్చని భావిస్తున్న తరుణంలో టీడీపీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూచన మేరకు సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, బీద రవిచంద్ర, ఉగ్ర నరసింహారెడ్డి, నరసింహయాదవ్, పనబాక కృష్ణయ్యకు స్థానం కల్పించారు. తిరుపతి ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించారు. అధికార పార్టీలో అభ్యర్థి విషయం గురించి చర్చలు మొదలుకాకముందే చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించారు. ఈ విషయంలో గతానికి భిన్నంగా వ్యవహరించారు. తనదైన శైలికి భిన్నంగా ముందే అభ్యర్థిని ప్రకటించి దూకుడు ప్రదర్శించారు.
మరోవైపు ఈసారి బీజేపీ జనసేన కూటమి కూడా తిరుపతి ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. తెలంగాణలో పార్టీ బలోపేతం ఏపీలోనూ తమకు కలిసొస్తుందని బీజేపీ అనుకుంటోంది. తమ పార్టీకి చెందిన అభ్యర్థి తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని బీజేపీ క్లారిటీ ఇచ్చింది. ఏపీ నేతలతో పాటు బీజేపీ జాతీయ నేతలు సైతం తిరుపతిపై ఫోకస్ చేస్తున్నారు. బీజేపీ కారణంగానే తిరుపతి అభివృద్ధి జరిగిందని.. తిరుపతి అభివృద్ధి కోసం టీడీపీ, వైసీపీ చేసిందేమీ లేదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ దూకుడు పెంచడంతో.. ఆ పార్టీ దూకుడును తట్టుకుని నిలబడేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chandrababu naidu, Tirupati Loksabha by-poll