ఏపీ టీడీపీలో చంద్రబాబు కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా గుర్తింపు తెచ్చుకున్న బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో విజయవాడ సహా కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన బుద్దా వెంకన్న... ఎన్నికల తరువాత కూడా టీడీపీని కౌంటర్ చేసే వారిని టార్గెట్ చేయడంలో ముందుంటున్నారు. సీఎం జగన్, వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి విమర్శలకు ఎప్పటికప్పుడు సమాధానం చెబుతున్నారు. అయితే ఉన్నట్టుండి ఆయన కృష్ణా జిల్లా టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ అర్బన్ పార్టీ అధ్యక్షునిగా వచ్చే టర్మ్ నుంచి ఉండబోనని బుద్దా వెంకన్న తేల్చిచెప్పేశారు. భవిష్యత్లో ఎవరికి పదవి వచ్చినా తాను అన్ని విధాలా సహకరిస్తానన్న అభిప్రాయాన్ని సమావేశంలో వెల్లడించి బుద్దా అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయారు. దీంతో ఇప్పటికప్పుడు ఆయన ఇలాంటి నిర్ణయాన్ని ఎందుకు ప్రకటించారనే అంశంపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు తీరు కారణంగానే ఆయన అలిగారని... అందుకే ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ ఎంపీ కేశినేని నానితో బుద్దా వెంకన్న ట్విట్టర్ వార్కు దిగడంపై చంద్రబాబు ఆయనకు క్లాస్ తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ కారణంగానే ఆయన విజయవాడ అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగనని ప్రకటించారని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అయితే ఏడాది తరువాత వేసే కమిటీలకు ఇప్పుడే ప్రకటనలు ఎందుకని టీడీపీలోని మరో వర్గం అభిప్రాయపడుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Buddha venkanna, Chandrababu naidu, Kesineni Nani, Tdp, Vijayawada