రాష్ట్రంలో నెలకంటున్న అశాంతి వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల హస్తముందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా అవినీతి మాఫియా శక్తులు స్వైరవిహారం చేస్తున్నాయని మండిపడ్డారు. పోలీసుల్లో ఒక వర్గం అధికార వైసీపీ నాయకులతో కుమ్మక్కై, వారి చెప్పుచేతల్లో పనిచేయడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టిస్తున్నవారిపై చర్య తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖరాశారు. ఎక్కడికక్కడ బలహీన వర్గాలపై దాడులు జరుగుతుంటే ప్రజాస్వామ్యం ఖూని అవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులు, దౌర్జన్యాలు ఇలాగే కొనసాగితే ప్రజలకు పోలీసు వ్యవస్థపై గల నమ్మకం పూర్తిగా నశిస్తుంది. పోలీసులు వేధించడం కాకుండా భద్రతగా నిలబడాలి. రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ లా’ను సుదృఢంగా నిలబెట్టడం తోపాటుగా, ప్రజలకు పూర్తి భద్రతతో కూడిన పోలీసింగ్ ప్రస్తుత తక్షణావసరమన్నారు.
ఈనెల 11న చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో వైసీపీ మాఫియా పడగవిప్పిందనని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. కురబలకోట మండలం అంగళ్లు వద్ద అధికార పార్టీ వైకాపాకు చెందిన దాదాపు 200మంది టీడీపీ నేతలపై దాడి చేసి వారి వాహనాలను కూడా ధ్వంసం చేశారని తెలిపారు. అంతటితో ఆగకుండా ఒక జర్నలిస్ట్ పైకూడా దాడిచేశారు, అతని కెమెరాను లాక్కున్నారని తెలిపారు. వైసీపీ నేతల దాడికి నిరసనగా ఆందోళన తెలుపుతున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోని.. అక్కడికక్కడ 144 సెక్షన్ విధించడమేంటని ప్రశ్నించారు. డికి పాల్పడిన అధికార వైసీపీ వారిని అరెస్ట్ చేయకుండా, శాంతియుతంగా నిరసన చెప్పే బాధిత టిడిపి నాయకులను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు.
హింస వెనుక పెద్దిరెడ్డి హస్తం..
చిత్తూరు జిల్లాలో ప్రజలపై వేధిపులు, చిత్రహింసలు, హత్య కేసులు పెరిగిపోతుండటం ఏ మాత్రం యాదృచ్చికం కాదు.. ఈ శక్తుల వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడి హస్తముందని చంద్రబాబు ఆరోపించారు. గంగాధర నెల్లూరులో మామిడి చెట్ల నరికివేత, పెనుమూరు PHCలో మహిళా వైద్యురాలిపై వేధింపులు, సోమల, చౌడేపల్లి మండలాల్లో ఎస్సీ వర్గానికి చెందిన ఓం ప్రతాప్, నారాయణ అనుమానాస్పద మృతి చెందడం, పుంగనూరులో బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం, బి కొత్తకోట మండలం జడ్జి రామకృష్ణపై వాళ్లు చేసిన దాడి, వేధింపులు ఇలా ప్రతి ఘటనలోనూ వైసీపీకి చెందిన వారే నిందితులుగా ఉన్నారని వారిపై చర్యలు తీసుకోవడంలేదని గుర్తు చేశారు. బలహీనవర్గాలపై అణచివేతలు కొనసాగుతున్నా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం ఈ అరాచకశక్తులను ఇంకా ప్రోత్సాహిస్తూనే ఉన్నారని చంద్రబాబు ఆరోపించారు.
టీడీపీ నేతల హౌస్ అరెస్టులు
దాడికి నిరసనగా టీడీపీ నేతలు శనివారం 'ఛలో తంబళ్లపల్లె'కి పిలుపునిచ్చారు. ఉద్రిక్తల నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ జిల్లా టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్యనేతలను హౌస్ అరెస్ట్ చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి, తిరుపతిలో టీడీపీ నేత నరసింహయాదవ్,కలికిరిలో నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి తదితర నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కరోనా కారణంగా ఛలో తంబళ్లపల్లె కార్యక్రమానికి అనుమతినివ్వలేదని పోలీసులు స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, AP DGP, Chandrababu naidu, Peddireddy Ramachandra Reddy, Tdp, Ysrcp