కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) (సీపీఎం) సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో పార్టీ స్థాపితమైన 57 ఏళ్ల తర్వాత.. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి పొలిట్బ్యూరోలోకి తొలిసారి ఒక దళిత నేతకు చోటు కల్పించింది. అదే సమయంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు సీతారాం ఏచూరి. ఈ మేరకు పార్టీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి.
సీపీఎం పార్టీ 23వ కాంగ్రెస్ సమావేశాలు కేరళలోని కన్నూర్ వేదికగా జరుగుతున్నాయి. సదస్సులోలో భాగంగా ఆదివారం సీపీఎం పార్టీ పొలిట్బ్యూరోను ఎన్నుకున్నారు. మొత్తం 17 మంది సభ్యులతో పొలిట్బ్యూరోను పార్టీ ఎన్నుకుంది. ఈ ఎన్నికలో పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత రామ్ చంద్ర డోమ్ను పొలిట్బ్యూరోలోకి తీసుకున్నారు. దశాబ్దాల సీపీఎం చరిత్రలో దళిత నేతకు ఈ పదవి దక్కడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
బీజేపీ మాదిరిగానే సీపీఎం సైతం పార్టీ పదవుల కోసం గరిష్ట వయసు 75గా నిర్ణయించడంతో కొందరు సీనియర్లు పోటీ చేయలేదు. దాంతో దళిత నేత డోమ్ ను అవకాశం వరించింది. మరోవైపు సెంట్రల్ కమిటీలో గతంలో 95 మంది ఉండగా, తాజాగా 85 మందితోనే కమిటీని నిర్ణయించారు. తాజా కమిటీలో మొత్తం 17 మంది కొత్తవాళ్లుండగా, 15 మంది మహిళలకు చోటు కల్పించారు.
దశాబ్దం కిందట కూడా జాతీయ రాజకీయాల్లో తనదైన ప్రభావం చాటుకున్న సీపీఎం బెంగాల్ లో పతనమైన తర్వాత దేశమంతటా తిరోగమన దిశలో పయనించినట్లయింది. ప్రస్తుతం సీపీఎం ఒక్క కేరళలో మాత్రమే, అది కూడా సీపీఐ, ఇతర లెఫ్ట్ పార్టీల మద్దతుతో అధికారంలో కొనసాగుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోగా పార్టీకి తిరిగి వైభవం దక్కేలా కొత్త పొలిట్ బ్యూరో నిర్ణయాలు తీసుకోనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CPM, Sitaram Yechury