చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకేకు చిన్నమ్మ శశికళ ఫీవర్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు జీవితం ముగించుకుని.. నాలుగేళ్ల జైలు జీవితం తర్వాత తమిళనాడులో శశికళ అడుగుపెట్టబోతున్నారు. సోమవారం చెన్నైకి చేరుకోనున్న శశికళకు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. ఈ సందర్భంలో.. అధికార అన్నాడీఎంకేను తాజాగా ఓ అంశం కలవరపెడుతోంది. జయలలిత సీఎంగా ఉన్నప్పటి నుంచి రాజకీయంగా తెర వెనుక కీలక పాత్ర పోషించిన శశికళ అన్నాడీఎంకేలో తనకంటూ ఓ వర్గాన్ని సృష్టించుకున్నారు. ఆమె జైలులో ఉన్నా వారితో శశికళ వేగులు టచ్లో ఉండేవారు.
అలాంటి వారిలో 10 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సోమవారం చిన్నమ్మ వెంట చెన్నైకు రాబోతున్నట్లు తెలిసింది. ఆదివారం రాత్రికే ఆ పది మంది ఎమ్మెల్యేలు శశికళను కలిసి సంఘీభావం తెలిపేందుకు బెంగళూరు వెళ్లినట్లు సమాచారం. దక్షిణ తమిళనాడుకు చెందిన మరికొందరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా చిన్నమ్మతో ఫోన్లో టచ్లో ఉన్నట్లు తెలిసింది. దీంతో.. శశికళ తమిళనాడులో అడుగుపెట్టకముందే అన్నాడీఎంకేలో కల్లోలానికి కారణమవుతున్నారన్న చర్చ మొదలైంది. అన్నాడీఎంకే మాత్రం శశికళ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉంది.
చెన్నైకి ఆమె రాబోతున్న నేపథ్యంలో.. ఆమెను ఎవరు కలిసినా, సంప్రదించినా పార్టీ నుంచి బహిష్కరిస్తామని ఇప్పటికే కీలక సమావేశంలో అధిష్టానం హెచ్చరించింది. బెంగళూరులో తన కారుపై అన్నాడీఎంకే జెండాను శశికళ ఉపయోగించడాన్ని తప్పుబట్టిన అన్నాడీఎంకే తమిళనాడులో ఆమె గానీ, ఆమె వర్గం గానీ అన్నాడీఎంకే జెండాను ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. అన్నాడీఎంకేతో పొత్తులో ఉన్నామని ప్రకటించిన బీజేపీ ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AIADMK, Sasikala, Tamil nadu Politics, Tamilnadu