ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావాల్సిన సాయం అందిస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లోక్సభలో ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎంపీల డిమాండ్లపై స్పందించారు. ఏపీ కూడా దేశంలో భాగమేనని, విభజన తర్వాత కొన్ని రాష్ట్రాల పరిస్థితులు ఎలా ఉంటాయో తనకు తెలుసన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంత సాయం ఇవ్వగలిగితే అంత మనస్ఫూర్తిగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 14 ఫైనాన్స్ కమిషన్ ప్రకారం 2015 నుంచి 2020 వరకు రూ.2,06,910 కోట్లు ఇస్తామన్నారు. ఇవి కాకుండా 2016 సెప్టెంబర్లో స్పెషల్ ప్యాకేజీ కింద రూ.8,140 కోట్లు ఇచ్చామన్నారు. వీటితో పాటు మరో రూ.24,037 కోట్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు రాజ్నాథ్ చెప్పారు.
అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి.. వివిధ అంశాలపై మాట్లాడుతూ వచ్చారు. నాలుగేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రస్తావించారు. ఎంతసేపయినా ఏపీ గురించి ప్రస్తావించకపోవడంతో టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ అంశాలను ప్రస్తావించాలని డిమాండ్ చేశారు. ఇంతలో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ జోక్యం చేసుకున్నారు. కేంద్ర హోంమంత్రి.. దేశంలోని అన్ని సమస్యలపైనా మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పారు. తన ప్రసంగాన్ని ముగించే ముందు ఏపీకి సంబంధించిన అంశాలను ప్రస్తావించిన రాజ్ నాధ్.. ఎన్డీయే నుంచి టీడీపీ మద్దతు ఉపసంహరించుకున్నా.. చంద్రబాబునాయుడు తమ మిత్రుడేనని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp-tdp