దేశంలో అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందాలంటే.. జనాభా నియంత్రణ కూడా ఓ అవసరం అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ చేసిన కీలక ప్రసంగంలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఈ అంశంపై న్యూస్18 నెట్వర్క్ గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో యూపీ సీఎం ఆదిత్యనాథ్ జనాభా నియంత్రణ మీద మాట్లాడారు. నరేంద్ర మోదీ ఇచ్చిన నినాదం చాలా మంచిదన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకుంటే, సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ సమానంగా అందాలంటే, జనాభా నియంత్రణ మీద కచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్ దేశంలో అతిపెద్ద రాష్ట్రం. 2012 లెక్కల ప్రకారం యూపీలో 20.42 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ జనాభాలో 18 శాతం ముస్లిం మైనారిటీలు ఉన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో 30 నుంచి 35 శాతం లబ్ధిదారులు వారే ఉన్నారని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. జనాభా నియంత్రణ అనేది ఓ నిజమైన సమస్య అన్న యూపీ సీఎం.. ఈ అంశంపై ఓ పటిష్టమైన పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: News18, Uttar pradesh, Yogi adityanath