ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్ శివారు బీఎన్ రెడ్డి నగర్లోని తన నివాసంలో శనివారం ఉదయం నుంచి ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆరోగ్యం క్షీణిస్తుండటంతో దీక్ష విరమించుకోవాలని వైద్యులు సూచించారు. అశ్వత్థామరెడ్డి అందుకు నిరాకరించడంతో పోలీసులు బలవంతంగా దీక్షను భగ్నం చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకున్న క్రమంలో పోలీసులకు అపార్ట్మెంట్ వాసులకు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.
కాగా, సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 44వ రోజుకు చేరింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండును పక్కనపెట్టినా.. ప్రభుత్వం చర్చలకు దిగిరాకపోవడంపై కార్మిక వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.మరోవైపు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కూడా కార్మిక వర్గాల్లో ఆగ్రహం తెప్పించింది. తాత్కాలికంగా విలీన డిమాండ్ను పక్కనపెట్టినా.. కార్మికులు ఏ క్షణాన్నైనా మళ్లీ విలీనం కోసం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారు.ప్రభుత్వాన్నిన అస్థిరపరిచేందుకు విపక్షాలతో కలిసి కుట్రపూరితంగా జేఏసీ నేతలు సమ్మెకు వెళ్లారని.. కాబట్టి చర్చలు జరపడం కుదరదని అఫిడవిట్లో తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ashwathama Reddy, CM KCR, Telangana, Telangana RTC strike, TSRTC Strike