దేశంలో ఉన్న అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేసేందుకు దేశవ్యాప్తంగా జాతీయ పౌరుల జాబితా(ఎన్ఆర్సీ) ను కచ్చితంగా నిర్వహించి తీరుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం తాము ఈ హామీని అమలు చేసి తీరుతామని ఆయన పలు సందర్భాల్లో కుండబద్దలు కొట్టారు. దీనిపై నెట్వర్క్18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా 2024 లోగా ఎన్ఆర్సీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో తాము ఈ హామీని చేర్చామని, దానికి ప్రజలు తమకు అధికారాన్ని కట్టబెట్టి మద్దతు ఇచ్చారని వెల్లడించారు. వచ్చే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎన్ఆర్సీ అనేది కీలక అంశం అవుతుందని వ్యాఖ్యానించారు. ఇక.. ఎన్ఆర్సీలో భాగంగా, దేశవ్యాప్తంగా డిటెన్షన్ క్యాంపులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించడానికి జాతీయ పౌరుల జాబితా కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని షా అభిప్రాయపడ్డారు.
కాగా, ఎన్ఆర్సీ ప్రభావం దేశంలోని ముస్లింలపై ఎలాంటి పడబోదని, ఎలాంటి మత వివక్ష ఉండబోదని అమిత్ షా స్పష్టం చేశారు. ఆప్ఘనిస్తాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారిని శరణార్థులుగా పరిగణించబోమని, 2014 డిసెంబర్ 31కి ముందు ఆ దేశాల నుంచి వచ్చిన వారికి సీఏబీ కింద తొలుత పౌరసత్వం మంజురు చేస్తామని వివరించారు. మస్లిమేతరులనే శరణార్థులుగా పరిగణిస్తామని తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లో వాళ్లు వివక్షకు గురవుతున్నారని వెల్లడించారు. స్వాతంత్ర్య సమయంలో ఈ రెండు దేశాలు 30 శాతం హిందూ జనాభాను కలిగి ఉండేవని.. కానీ ప్రస్తుతం 6 శాతానికి పడిపోయిందని గుర్తు చేశారు.
మరి ఆ జనాభా అంత ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. అందువల్లే జాతీయ పౌరుల జాబితాను అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తేల్చిచెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న హిందువులు, జైనులు, సిక్కులు, క్రిస్టియన్లు, బౌద్ధ మతస్థులు, పార్శీలు ఎలాంటి ఆందోళన పడాల్సిన పని లేదని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Bjp, Central Government, News18, NRC