ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఓ దళిత మహిళపై హత్యాచార ఘటనకు సంబంధించి ఏపీ డీజీపీకి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అమలు కావడం లేదని ఆ లేఖలో చంద్రబాబు ఆరోపించారు. మేకలు మేపుకోవడం కోసం వెళ్లిన దళిత మహిళ నాగమ్మను అతిదారుణంగా అత్యచారం చేసి, చంపడం చాలా దారుణమని లేఖలో పేర్కొన్నారు. ‘డిసెంబర్ 7న మేకలు మేపుకోవడానికి వెళ్లిన మహిళ అత్యాచారానికి గురై, విగతజీవిగా పడి ఉండటం చూసి రాష్ట్రం మొత్తం విస్తుపోయింది. రాష్ట్రంలో జరుగుతున్న ఇటువంటి సంఘటనలతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలు కావడం లేదు. అధికార పార్టీ అండతో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలపై దాడులు పెరిగిపోయాయి. ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ నాయకులకు అనుకూలంగా హత్యాచారానికి కారకులైన దోషులను రక్షించాలని చూస్తున్నారు. అందులో బాగంగానే ఎప్.ఐ.ఆర్ లో దోషులను గుర్తు తెలియని వ్యక్తులు అని నమోదు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పడంతో ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టాన్ని అమలు చేసి బాధితులకు న్యాయం చేయండి. మానవ హక్కుల దినోత్సవం నాడైనా కనీసం బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించండి.’ అని డీజీపీకి రాసిన లేఖలో చంద్రబాబు కోరారు.
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలకు సంబంధించి పలుమార్లు టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయినా కూడా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఏపీ పోలీసులు వర్సెస్ ప్రతిపక్షం అన్నట్టుగా కూడా పరిస్థితి తయారైంది. పల్నాడు ప్రాంతంలో టీడీపీ కార్యకర్తలను ఊరి నుంచి వెళ్లగొడుతున్నారంటూ చంద్రబాబు ఆధ్వర్యంలో ఛలో ఆత్మకూరు కూడా గతంలో చేపట్టారు. 'చలో ఆత్మకూరు' కార్యక్రమం కోసం ఆత్మకూరు వెళ్లేందుకు ప్రయత్నించిన చంద్రబాబునాయుడిని పోలీసులు ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వలేదు.
ఏపీలో పోలీసుల తీరు మీద హైకోర్టు కూడా పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. సాక్షాత్తూ ఏపీ పోలీసు బాస్ డీజీపీని కోర్టుకు పిలిచి చివాట్లు కూడా పెట్టిన సందర్భం ఉంది. కోర్టులు మొట్టికాయలు వేసినా పోలీసులు మారడం లేదని టీడీపీ ఆరోపిస్తోంది. ఇటీవల పోలీసుల తీరుతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబాన్ని టీడీపీ నేతలు ఉదాహరణగా చూపుతున్నారు. కర్నూలు జిల్లాలో పోలీసుల తీరు వల్లే సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని, కోర్టు చివాట్లు పెట్టినప్పుడైనా డీజీపీ మారి ఉంటే సలాం కుటుంబానికి ఈ పరిస్థితి వచ్చేది కాదని గతంలో చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అసలు రాష్ట్రంలో ఏ కుటుంబానికి భద్రత లేదని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా సలాం కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులపైన వారిని డిస్మిస్ చేయాలని అయన డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP DGP, Chandrababu naidu, Gautam Sawang