కొత్తగా నిర్మించబోయే అసెంబ్లీ, సచివాలయ భవనాలు ప్రభుత్వానికి సంబంధించినవే తప్ప సీఎం కేసీఆర్ వ్యక్తిగతం కాదని మంత్రి తలసాని అన్నారు. కేసీఆర్ కోసమే వాటిని నిర్మించుకుంటున్నట్టు కాంగ్రెస్ నేతలు విమర్శించడం అర్థం పర్థం లేనిదన్నారు. ఏదో పిక్నిక్ కోసం వచ్చినట్టు.. పల్లీలు అమ్ముకునేవాళ్లలా అలా వచ్చి ఇలా వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. సోమవారం కాంగ్రెస్ నేతలు కొత్తగా నిర్మించబోయే అసెంబ్లీ,సచివాలయాలను పరిశీలించి పలు విమర్శలు గుప్పించడంతో తలసాని వాటిని తిప్పికొట్టారు. వాళ్ల లాగే మేము కూడా ఏదో నామమాత్రపు పాలన అందించాలని కాంగ్రెస్ కోరుకుంటోందని.. ప్రజలకు అవసరమైన పనులు చేస్తే వారు సహించడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ నేతలు అడ్డుపడినంత మాత్రానా అసెంబ్లీ, సచివాల నిర్మాణాలు ఆగిపోవని.. ఆరు నూరైనా ప్రజలు గర్వపడేలా కొత్త భవనాలు నిర్మిస్తామని చెప్పారు. పబ్లిసిటీ కోసమే కాంగ్రెస్ నేతలు లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలతో వేగలేకనే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు బయటకొచ్చేశారని ఆరోపించారు. దళితుడైన భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేతగా కొనసాగడం.. ఆ పార్టీలో ఉన్నవారికే ఇష్టం లేదని విమర్శించారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలల నిర్మాణం జరగలేదని కాంగ్రెస్ ఆరోపించడం సరికాలేదన్నారు.జనం మధ్యలోకి వెళ్లలేని
కాంగ్రెస్ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Talasani Srinivas Yadav, Telangana, Trs