కొన్ని సార్లు నేతలు చేసే వ్యాఖ్యలు.. చాలా వేగంగా నెట్టింట వైరల్గా మారుతాయి. తాజాగా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఒక్కసారిగా అందరిని దృష్టిని ఆకర్షించాయి. ఇందుకు కారణం.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు దీవ్వెనలివ్వమంటూ కోరడమే. అయితే వెంటనే తన తప్పును సరిదిద్దుకున్న మంత్రి గంగుల కమలాకర్.. కేసీఆర్ అని చెప్పారు. వివరాలు.. శనివారం కరీంనగర్ రూరల్ జిల్లా ఇరుకుల్ల గ్రామంలో జరిగిన పల్లెప్రగతిలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. హారితహారం కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని మొక్కలు నాటారు. మహిళా సంఘం, గౌడ సంఘాల కోసం నిర్మించిన కొత్త భవనాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పల్లెప్రగతిలో ప్రసంగించిన మంత్రి గంగుల కమలాకర్.. పెన్షన్ల గురించి మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లతో వృద్ధులు సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. చివరలో ఇన్ని మంచి పథకాలిచ్చిన చంద్రబాబుకు దీవెనలు అందించాలా వద్దా.. కడుపు చల్లగా ఉండాలని కోరుకోవాలా వద్దా.. అంటూ ప్రజలను ప్రశ్నించారు. దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. వెంటనే తన పొరపాటును గుర్తించిన మంత్రి గంగుల.. సీఎం కేసీఆర్కు దీవెనలు ఇవ్వాలని కోరారు. మంత్రి గంగుల కమలాకర్ తడబడి.. తన మాజీ బాస్ చంద్రబాబు పేరును ప్రస్తావించడంతో అక్కడ ఉన్నవారు కొందరు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.
మంత్రి గంగులను నిలదీసిన విద్యార్థులు.
మరోవైపు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ , పీజీ కళాశాల ప్రిన్సిపల్తో సహా విద్యార్థులపై మంత్రి గంగుల కమలాకర్ అసహనం వ్యక్తం చేశారు . కళాశాల ఆవరణలో నిర్మించ తలపెట్టిన కళాభారతి విషయంలో ప్రిన్సిపల్, విద్యార్థులు అభ్యంతరం తెలుపడంతో.. మంత్రి గంగుల కమలాకర్తో పాటు కలెక్టర్ శశాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ నగరంలోని నడిబొడ్డున ఉన్న కళాభారతి భవనం శిథిలావస్థకు చేరుకోగా.. నూతన భవనాన్ని నిర్మిస్తామని రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు . ఏడేళ్లు గడుస్తున్నా ... కళాభారతి నూతన భవనానికి పునాది పడలేదు . ప్రస్తుతం ఆ దిశగా .. అడుగులు పడుతున్నాయి . కలెక్టర్ శశాంక, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ క్రాంతితో కలిసి మంత్రి గంగుల కమలాకర్.. ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలోని ఖాళీ స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లారు .
అయితే కళాశాల ఆవరణలో కళాభారతి నిర్మాణాన్ని చేపట్టటం తమకు ఇష్టం లేదన్న విషయాన్ని మంత్రికి ప్రిన్సిపల్ రామకృష్ణతో పాటు విద్యార్థులు తెలియజేశారు. ఓ విద్యార్థి మరో అడుగు ముందుకేసి ... కళాశాలకు సంబంధించిన స్థలాన్ని వేరే నిర్మాణాలకు వాడుకోవటమేంటని మంత్రిని నిలదీశాడు. దీంతో అతడికి మొదట వివరించేందుకు ప్రయత్నించిన మంత్రి.. కొద్దిసేపటికి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలిసీ తెలియకుండా మాట్లాడొద్దని మందలించాడు . విద్యార్థిని అక్కడి నుంచి పంపించేయాలని పోలీసులకు చెప్పాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chandrababu Naidu, Karimnagar, Minister gangula kamalakar