ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలే దాడి చేసి బూతులు తిట్టారని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలే మంత్రి వెల్లంపల్లి మీద దాడి చేశారని చెప్పారు. మంత్రి అనిల్ ఈరోజు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ‘సంఖ్యా బలం ఉందని మండలిలో బిల్లులు అడ్డుకుంటున్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వనియకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. సభలో విద్వంసం సృష్టిస్తామని యనమల అనడం దారుణం. రాజ్యాంగ పదవిలో ఉన్న డిప్యూటీ చైర్మన్ కక్ష పూరితంగా వ్యవహరించారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక మండలి అడ్డుపెట్టుకుని చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు. రూల్స్ కి విరుద్ధంగా లోకేష్ సభలో వీడియోలు తీస్తున్నారు. లోకేష్ వీడియోలు తీస్తుంటే అడ్డుకున్న మంత్రి వెల్లంపల్లిపై దాడి చేశారు. దాడి చేసింది వాళ్ళు.. భూతులు తిట్టామని మాపై బురదజల్లుతున్నారు. సమయం ఉన్నా నిరవధిక వాయిదా ఎందుకు వేశారు? సంఖ్యా బలం ఉంటే ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా.. మీ బలం ఇంకెన్నాళ్లు ఉంటుంది..? మీకున్న బలం తాత్కాలికం మాత్రమే. ద్రవ్య వినిమయ బిల్లు అడ్డుకున్న దుర్మార్గపు ప్రతిపక్షంగా చరిత్రలో నిలిచిపోతారు.’ అని మంత్రి అనిల్ ఆరోపించారు.
తన మీద టీడీపీ ఎమ్మెల్సీలు చేసిన ఆరోపణలను మంత్రి అనిల్ ఖండించారు. ‘మహిళల ముందుకు వెళ్లి షర్ట్ ఇప్పి జిప్ తీసి చూపించారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. చైర్మన్ మీ మనిషే కదా వీడియోలు విడుదల చెయ్యండి. నిజాలు ప్రజలకు తెలుస్తాయి. చైర్మన్ దగ్గరకు వెల్దామా.. నిరూపించకపోతే రాజీనామా చేస్తానని లేఖలు ఇవ్వండి. దమ్ముంటే నా సవాల్ స్వీకరించి చైర్మన్ దగ్గరకు రండి.. అశోక్ బాబు, రాజేంద్రప్రసాద్, లోకేష్ రండి.’ అని మంత్రి అనిల్ సవాల్ విసిరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Anil kumar yadav, Ap legislative council, Nara Lokesh, Tdp