కర్ణాటక స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఆర్. శంకర్, మరో ఎమ్మెల్యే రమేష్ జార్జిహోళీ, మహేష్ కుమాటల్లిలను అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టంలోని పదో షెడ్యూల్ ప్రకారం వారిపై అనర్హత వేటు వేసినట్టు స్పీకర్ తెలిపారు. 2023 వరకు వారు పోటీ చేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అనర్హత వేటు వేశారు. కర్ణాటకలో 13 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు కుమారస్వామి ప్రభుత్వానికి రెబల్స్గా మారారు. దీంతో నాలుగు రోజుల హైడ్రామా తర్వాత విశ్వాస పరీక్షలో కుమారస్వామి ఓడిపోయారు. అనంతరం ఆయన రాజీనామాచేశారు. కుమారస్వామి ప్రభుత్వం పడిపోయిన 48 గంటల్లోనే రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఆర్. శంకర్ గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అనంతరం తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తానని, ఆ పార్టీలో కలుస్తానని గవర్నర్కు లేఖ రాశారు. దీంతో రెబల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య ఫిర్యాదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.