కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా రావడంతో కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం మొదలైంది. ప్రతిపక్ష నేత పదవికి సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్ష పదవికి గుండూరావ్ రాజీనామా చేశారు. కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, అందులో 12 సీట్లలో బీజేపీ ఖాతాలో పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. యడియూరప్ప సీఎం పదవికి ఎలాంటి ఢోడా లేదు. ఈ క్రమంలో బై పోల్ ఓటమికి బాధ్యత వహిస్తూ సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. అంతకు ముందు కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ... ఎవరైనా సరే ప్రజా తీర్పుకి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే... ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, ప్రజలే సరైన శిక్ష వేస్తారని... ఈ ఫలితాల్ని చూస్తే అర్థమవుతుందని మోదీ అన్నారు. జార్ఖండ్ పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వ వైఖరిని విబేధించిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. దీంతో కుమారస్వామి తన సీఎం పదవిని కోల్పోయారు. ఈ సందర్భంగా విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేల మీద అప్పటి స్పీకర్ ఈ శాసనసభ గడువు ముగిసేవరకు పోటీ చేయడానికి వీల్లేకుండా వేటు వేశారు. అయితే, స్పీకర్ ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీ తరఫున పోటీ చేశారు. వారి వల్లే తనకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందన్న యడియూరప్ప వారికి తన కేబినెట్లో మంత్రి పదవులు ఇస్తానని గతంలో ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karnataka Politics, Siddaramaiah