MLA rides bicycle with gas cylinder to polling booth : రెండు దశల్లో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల(Gujarat Assembly Elections) తొలి విడత పోలింగ్ ఇవాళ జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్(First Phase Polling).. సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. రాష్ట్రంలో తొలి దశ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో 89 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ జరుగుతున్న 89 సీట్లు..కచ్- సౌరాష్ట్ర,దక్షిణ గుజరాత్ ప్రాంతంలోని 19 జిల్లాలలో విస్తరించి ఉన్నాయి. తొలి దశలో 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 70 మంది మహిళలు ఉండగా.. 339 మంది స్వతంత్ర (Independent) అభ్యర్ధులున్నారు. ఈ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం మొత్తం 25,430 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. తొలిదశలో మొత్తం 2,39,76,670 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు.
మొదటి దశలో ఎన్నికలు జరగుతున్న 89 స్థానాల్లో 2017 ఎన్నికల్లో.. బీజేపీ 48, కాంగ్రెస్ 40, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. అయితే ఇవాళ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అందరి దృష్టిని ఆకర్షించారు. అమ్రేలిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పరేష్ ధనాని ఓటు వేయడానికి సైకిల్పై వంటగ్యాస్ సిలిండర్ కట్టుకుని తన కుటుంబ సభ్యులతో గురువారం పోలింగ్ బూత్కు వెళ్లారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయని దానిపై రాశారు. గ్యాస్తోపాటు నిత్యావసర వస్తువుల ధరల పెంపు, నిరుద్యోగంపై బీజేపీని నిందించిన పరేష్ ధనాని గ్యాస్ సిలిండరుతో పోలింగ్ కేంద్రానికి రావడం ఓటర్లను ఆకట్టుకుంది. గ్యాస్ ధరల పెంపు వల్ల గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పరేష్ జోస్యం చెప్పారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యం కారణంగా గుజరాత్లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిందని... గ్యాస్,ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఓటు వేసిన తర్వాత పరేష్ ధనాని చెప్పారు. కాగా, సైకిల్కి సిలిండర్ కట్టుకుని తన కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే ఓటేయడానికి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలొ వైరల్ అవుతోంది.
#WATCH | Amreli: Congress MLA Paresh Dhanani leaves his residence, to cast his vote, with a gas cylinder on a bicycle underscoring the issue of high fuel prices.#GujaratAssemblyPolls pic.twitter.com/QxfYf1QgQR
— ANI (@ANI) December 1, 2022
Gujarat polling : బీజేపీ అభ్యర్థిపై దాడి..తీవ్ర గాయాలతో హాస్పిటల్ కు తరలింపు!
ఇక, డిసెంబర్ 5న రెండో దశ ఎన్నికలు జరగనుండగా డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైన గెలిచి వరుసగా ఏడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భావిస్తుండగా..అప్పుడెప్పుడో గుజరాత్ లో కోల్పోయిన ప్రభను తిరిగి పొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. మోదీ సొంత ఇలాఖాలో విజయం సాధించి మోదీకి తానే ప్రత్యామ్నాయం అని చూపెట్టాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ ఉవ్విళ్లూరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.