జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన అధిక్యం లభించలేదు. మొత్తం 150 డివిజన్లు ఉన్న బల్దియాలో మేయర్ పీఠం కైవసం చేసుకోవాలంటే 76 స్థానాలు విజయం సాధించాల్సి ఉంది. అయితే గ్రేటర్ ఎన్నికల్లో 50కి పైగా డివిజన్లు కైవసం చేసుకున్న టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే మేజిక్ ఫిగర్కు చాలా దూరంలో నిలిచిపోయింది. మరోవైపు ఇప్పటివరకు వెలువడిన ఫలితాలను బట్టి చూస్తే బీజేపీ గ్రేటర్లో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచే అవకాశం ఉంది. ఇక ఎంఐఎం 42 డివిజన్ కైవసం చేసుకుంది. దీంతో గ్రేటర్ మేయర్ పీఠం దక్కడం ఎక్స్ అఫీషియో సభ్యులు కీలకం కానున్నారు. మొత్తం 52 మంది ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకుంటే మేయర్ ఎన్నికలో ఓటువేసే వారి సంఖ్య 202కి చేరనుంది. దీంతో మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 102 మేజిక్ ఫిగర్ అవసరం ఉంటుంది.
అయితే మొత్తం 52 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో టీఆర్ఎస్కు అధికంగా 37, బీజేపీకి ముగ్గురు, కాంగ్రెస్కు ఒక్కరు, ఎంఐఎంకు 10 మంది ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన అధికార టీఆర్ఎస్ కూడా ఎక్స్ అఫీషియో కలుపుకున్న మేయర్ పీఠం దక్కించుకోవాలంటే మరో 10 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆ పార్టీ ఎటువంటి ప్రయత్నాలు చేస్తుందనేది సర్వత్ర ఆసక్తిగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రేటర్ పీఠం కోసం టీఆర్ఎస్, ఎంఐఎంలు చేతులు కలపడమో లేక టీఆర్ఎస్కు ఎంఐఎం బయటి నుంచి మద్దతు ఇవ్వడమో జరగవచ్చని పులవురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక, బీజేపీకి మేయర్ పీఠం దక్కాలంటే మరో 50 వరకు సభ్యుల మద్దతు అవసం ఉంటుంది. ఇందుకోసం ఆ పార్టీ ఇతర పార్టీలతో జత కట్టే అవకాశం లేదు. దీంతో గ్రేటర్ పీఠం దక్కించుకోవాలనే తమ కళ నెరవేరకపోయినా.. టీఆర్ఎస్కు పూర్తి మెజారిటీ దక్కకుండా అడ్డుకోగలిగింది. ఎక్స్ అఫీషియో సభ్యులతో కూడా టీఆర్ఎస్ మేయర్ పీఠం సొంతం చేసుకోకుండా చేసింది. దీంతో అధికార పార్టీ గట్టి హెచ్చరికలనే పంపింది. భవిష్యత్తులో తెలంగాణలో పాగా వేసే ఆలోచనలో ఉన్న బీజేపీ గ్రేటర్లో భారీగా ఓటు బ్యాంక్ను పెంచుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, GHMC Election Result, Hyderabad - GHMC Elections 2020, Trs