జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెల్లడి తుది అంకానికి చేరింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలను చూస్తే అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరా హోరి పోరు సాగిందనే చెప్పాలి. ఎప్పటిలాగానే ఎంఐఎం పార్టీ పాతబస్తీలో తన సత్తా చాటింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాలుగు సీట్లతో సరిపెట్టుకున్న బీజేపీ ఈ సారి భారీగా పుంజుకుంది. దుబ్బాక ఉప ఎన్నిక జోష్లో బీజేపీ గ్రేటర్లో మరింత దూకుడుగా వ్యవహరించింది. టీఆర్ఎస్, ఎంఐఎం టార్గెట్గా విమర్శల వర్షం కురిపింది. అలాగే ఎన్నికల ప్రచారానికి పలువురు బీజేపీ అగ్రనేతలు రావడం కూడా ఆ పార్టీకి కలిసివచ్చిందనే చెప్పాలి. గ్రేటర్లో బీజేపీ దాదాపు 50 స్థానాలను కైవసం చేసుకుంది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ 46 స్థానాలు అధికంగా గెలుపొందింది.
అయితే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పుంజుకోవడం టీఆర్ఎస్పై భారీ ప్రభావాన్ని చూపింది. గతంలో గ్రేటర్ పోరులో 99 స్థానాల్లో గెలుపొందిన టీఆర్ఎస్ ఈ సారి 56 స్థానాలకే పరిమితమైంది. అంటే దాదాపు 43 స్థానాల వరకు కోల్పోయింది. అయితే ఈ స్థానాలు అన్ని దాదాపుగా బీజేపీ తన ఖాతాలో వేసుకోగలిగింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో ఒక స్థానం మినహా బీజేపీ గెలిచిన స్థానాలన్ని గతంలో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించినవే. ఆ ఒక్క స్థానం గతంలో ఎంఐఎం గెలుపొందిన జాంబాగ్.
మరోవైపు ఎంఐఎం కంటే కూడా ఎక్కువ డివిజన్లను బీజేపీ కైవసం చేసేకుంది. గ్రేటర్లో మేయర్ పీఠం దక్కించుకోకపోయిన టీఆర్ఎస్ మేజిక్ ఫిగర్కు అవసరమైన స్థానాలు సాధించకుండా అడ్డుకుని బీజేపీ విజయం సాధించందనే ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు. ఇక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన అధిక్యం లభించలేదు. మొత్తం 150 డివిజన్లు ఉన్న బల్దియాలో మేయర్ పీఠం కైవసం చేసుకోవాలంటే 76 స్థానాలు విజయం సాధించాల్సి ఉంది. అయితే గ్రేటర్ ఎన్నికల్లో 50కి పైగా డివిజన్లు కైవసం చేసుకున్న టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే మేజిక్ ఫిగర్కు చాలా దూరంలో నిలిచిపోయింది. దీంతో మేయర్ ఎన్నికలో ఎక్స్ అఫీషియో సభ్యులు కీలకం కానున్నారు. దీంతో మేయర్ ఎన్నిక ఎలా జరుగుతుందో వేచిచూడాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, GHMC Election Result, Hyderabad - GHMC Elections 2020, Trs