విశాఖ ఉక్కు విషయంలో ఎవరు డ్రామాలు ఆడుతున్నారో ప్రజలకు తెలుసు అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ ఉక్కుపై అందరం కలిసి పోరాడితేనే లాభం ఉంటుందని పిలుపు ఇచ్చారు. కేంద్రం వైఖరిని ప్రధానమంత్రి మోదీనే స్వయంగా చెప్పినప్పుడు ఇంకా ప్రజలను ఎందుకు మభ్య పెట్టడం అన్నారు. అయితే ఇంకా ఏం జరగలేదని రాష్ట్రంలోని పెద్దలు మాట్లాడడం సరైంది కాదు అన్నారు. ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్రానికి సమాచారం అందిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఎం జగన్ తో కలిసి పనిచేస్తామని స్వయంగా చంద్రబాబు చెప్పారు అన్న విషయాన్ని గంటా గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉప సంహరణకు బీజేపీ నేతలే ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు ఇటీవల ప్రధానిని కలిసినప్పుడు విశాఖ ఉక్కు అంశం సీఎం జగన్ ఎందుకు ప్రస్తావించలేదని గంటా నిలదీశారు..?
ఢిల్లీలో పాదయాత్రకు టీడీపీ సిద్ధంగా ఉందని.. అందుకు అందరూ కలిసిరావాలి అన్నారు. అలాగే విశాఖ ఉక్కుపై పవన్ కల్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల తరఫున పవన్ పోరాడితే ఆ పార్టీ పొత్తు కోసమైనా కేంద్రం వెనుకడుగు వేసే అవకాశం ఉంటుంది అన్నారు. రాష్ట్ర ఎంపీలు రాజీనామా చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుందని గంటా అభిప్రాయపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఆ స్థానంలో టీడీపీ పోటీ పెట్టదని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని సీఎంను కోరుతున్నాను అన్నారు గంటా శ్రీనివాసరావు.
అంతా అయిపోయిన తరువాత ప్రజలను మభ్య పెట్టాలని వైసీపీ నేతలు చూసినా ఎవరూ నమ్మరని గంటా అభిప్రాయపడ్డారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ అమ్మకం నిర్ణయం జరిగిపోయిందని.. ఇక అది ముగిసిన అధ్యాయమని.. అయినా వైసీపీ, బీజేపీ నేతలు విశాఖ ప్రజలను తప్పుదోవ పట్టించడం బాధేస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణకు సహకరించి చరిత్రహీనులుగా మిగలొద్దని వైసీపీ ఎంపీలకు గంటా సలహా ఇచ్చారు. ఇలాంటి సమయంలో పార్టీలకు అతీతంగా అందరూ ఒక మాటమీదకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ బడ్జెట్ సమావేశాల్లో తన రాజీనామాను ఆమోదింపజేసుకుంటాను అన్నారు. ఇప్పటికైనా వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని.. అప్పుడే కేంద్రం దిగి వస్తుంది అన్నారు గంటా. మరోవైపు గంటా విమర్శలు చేసిన కాసేపటీకే సీఎం జగన్ సైతం ప్రధానికి మరోసారి లేఖ రాశారు. అఖిలపక్ష నేతలను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు జగన్.
ఇది కూడా చదవండి: ప్రధాని మోదీకి జగన్ మరో లేఖ: అఖిలపక్ష నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వాలన్న సీఎం
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం మరోసారి పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల ముందే అంశం తెరపైకి రావడంతో అన్ని పార్టీలు దీన్ని అస్త్రంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ బీజేపీ, జనసేనలు మాత్రం ఎలా ముందుకు వెళ్లాలి అన్నది తేల్చుకోలేకపోతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Ganta srinivasa rao, Visakha, Visakhapatnam, Vizag, Vizag Steel Plant